నయీమ్ ఇంట్లో పోర్న్ సీడీలు, పెన్డ్రైవ్లు: అమ్మాయిల అక్రమ రవాణా?
హైదరాబాద్: ఎదురుకాల్పుల్లో మరణించిన గ్యాంగస్టర్ నయీమ్ ఇంట్లో పోలీసులు సోదాలు పూర్తి చేశారు. సోమవారం రాత్రి సోదాలు పూర్తయ్యాయి. ఇంట్లో 2.8 కోట్ల రూపాయలు, కిలో 93 గ్రాముల బంగారం లభించినట్లు సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్ నవీన్ చంద్ చెప్పారు. ఇంట్లో నాలుగు పిస్టోళ్లు, ఓ నకిలీ రివాల్వర్, 38 బుల్లెట్లు, లభించినట్లు కూడా ఆయన తెలిపారు.
సోమవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో గల బాషా ఇంటిని గ్రైహౌండ్్స బలగాలు చుట్టుముట్టి నయామ్ను హతమార్చాయి. నయీమ్ ఇంట్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల పత్రాలు కూడా బయటపడ్డాయి. తమకు లభించిన నగదు విషయాన్ని డిఆర్ఐకి, ఐటి శాఖకు తెలియజేస్తామని నవీన్ చంద్ చెప్పారు .
నయీమ్ ఇంట్లో 200 సెల్ఫోన్లు, వందల కొద్ది సిమ్ కార్డులు, పోర్న్ సీడీలు, పెన్డ్రైవ్లు లభించినట్లు కూడా సమాచారం. నయీమ్ కుటుంబంతో సంబంధం లేని 11 మంది ఉన్నట్లు నవీన్ చంద్ చెప్పారు. ఇందులో నలుగురు బాలికలు ఉన్నారని, వారిని శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగిస్తామని చెప్పారు. నయీమ్ మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు.
అలకాపురిలోని తన నివాసం నుంచి నయీమ్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. నయీమ్ భార్య ఫర్హానాతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు డిఎస్పీలు, నలుగురు ఎఎస్పీలు సోదాల్లో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం నెక్నంపూర్లో పోలీసులు ఇద్దరు నయీమ్ అనుచరులను అదుపులోకీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ వాచ్మన్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, నల్లగొండ జిల్లా భువనగిరిలోని నయీమ్ నివాసంలోనూ, ఎంపిపి వెంకటేష్ యాదవ్ నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. భువనగిరిలోని నయీమ్ బంధువులు అనుచరుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు నల్లగొండ జిల్లాలోని మిర్యాలగుడాలో గల నయీమ్ అత్త, ఆమె అక్క ఇళ్లలో రూ.6.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల్లోని బంగారం, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్లో గల మరో నయీమ్ ఇంటిలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 38 లక్షల రూపాయలు, నాలుగు రివాల్వర్లు లభించాయి. భూమి సెటిల్మెంట్ల కోసం నయీమ్ ఈ ఇంటిని వాడేవాడని చెబుతున్నారు.