వేధిస్తోందని చైర్ లాగిపడేశారు: 'టి' దెబ్బకు ఏపీ మహిళా అధికారి బదలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ పద్మావతి ఏపీకి చెందిన ఉద్యోగిని అని, ఆమె తెలంగాణ ఉద్యోగులను వేధిస్తోందని, ప్రమోషన్లలో తమకు అన్యాయం చేస్తోందని పలువురు తెలంగాణ ఉద్యోగులు నవీన్ మిట్టల్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు.
దీంతో నవీన్ మిట్టల్ చాంబర్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారు పద్మావతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవీన్ మిట్టల్ నేమ్ ప్లేట్ను తొలగించారు. తక్షణమే పద్మావతిని తొలగించాలని, ఏపీకి పంపించాలని డిమాండ్ చేశారు.
కొందరు అధికారులు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఆంధ్రా ఉద్యోగులకు తొత్తులుగా పని చేస్తున్నారని, అలా చేస్తే మిమ్మల్నీ ఇక్కడి నుంచి పంపిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు పద్మావతిని బయటకు పంపించి, ఆమె చైర్ లాగి పడేశారు.
చర్చలకు ఆహ్వానించిన మిట్టల్
తెలంగాణ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో నవీన్ మిట్టల్.. సచివాలయ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. పద్మావతి తెలంగాణ ఉద్యోగులను వేధిస్తోందని రెండు రోజులుగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పెన్ డౌన్ చేస్తామని హెచ్చరించారు. దీంతో చర్చలు జరిపి, పద్మావతిని బదలీ చేశారు.
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా: పద్మావతి
తన పైన ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని పద్మావతి వివరణ ఇచ్చారు. ప్రమోషన్ల విషయంలో తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడటం లేదని చెప్పారు. కొందరు తన పైన ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను నిబంధనల ప్రకారమే తెలంగాణకు కేటాయించబడ్డానని చెప్పారు. తాను తెలంగాణ ఉద్యోగిని వేధించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.