అవన్నీ వద్దు.. వాటితో ఆశీర్వదించండి.. కిషన్ రెడ్డి మాటతో అభిమానులు అదే దారి
హైదరాబాద్ : మూడుసార్లు ఎమ్మెల్యే అంటే మాటలా? అధికార దర్పంతో దడదడలాడించాలి. కానీ ఆయన రూటే సెపరేటు. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక సంప్రదాయ పార్టీ నేతగా ఆయన ఇజం వేరు. నిరాడంబరత ఆయన నైజం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన ఏనాడు భేషజాలకు పోలేదు. ఎక్కడ ఉన్నా, ఏ స్థాయికి వెళ్లినా జనాలనే నమ్ముకున్నారు.. జనాలతోనే ఉన్నారు.
గెలుపోటములకు దూరంగా ప్రజలకు దగ్గరయ్యారు. అంతెందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే.. నాకెందుకులే అని ఇంట్లో కూర్చోలేదు. ప్రతి బస్తీలో పాదయాత్ర చేశారు. ప్రతి ఒక్కరినీ కలుస్తూ ఇన్నాళ్లు తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతటి కమిట్మెంట్ ఉన్న ఆ లీడర్ ఎవరో కాదు.. యువ నాయకుడు కిషన్ రెడ్డి. అయితే సింపుల్గా ఉండాలనుకునే కిషన్ రెడ్డి తత్వం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన వేళ.. తనను కలవడానికి వస్తున్న అభిమానులకు ఆయన చేసిన విజ్ఞప్తి చర్చానీయాంశమైంది.
ఆత్మహత్యలు చేసుకున్నోళ్లు పాస్ కాలేదు.. అంతమందిలో 1,137 మందే పాస్.. ఇంటర్ రీవెరిఫికేషన్ కథ
అభివృద్ధే ఆయన పథం.. నిరాడంబరత ఆయన నైజం
హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి అంబర్పేటను అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. కేంద్రంలో తనకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని నియోజకవర్గానికి వన్నెలద్దారు. ఓడినా, గెలిచినా మీవాడినంటూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. చెరగని చిరునవ్వుతో చూడగానే ఆకట్టుకునే కిషన్ రెడ్డి.. అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా ఓటమిచెందినా బాధపడలేదు. సికింద్రాబాద్ నుంచి లోక్సభ బరిలో దిగి ఎంపీగా విజయం సాధించారు.
కిషన్ రెడ్డికి స్వతహాగా అభిమానులు ఎక్కువ. వారిని పేరు పెట్టి పిలిచే చనువు ఆయన సొంతం. అందుకే ఆయన ఛరిష్మా డిఫరెంట్. అయితే ఎంపీగా గెలిచిన వేళ అభిమానుల సందడి ఎక్కువైంది. ఎవరొచ్చినా బొకేలు, పూలదండాలతో రావడం కిషన్ రెడ్డికి నచ్చలేదు. దాంతో ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు.
ప్రభుత్వ పాఠశాలకు కిషన్ రెడ్డి మెరుగులు
అంబర్పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రస్థానం అభివృద్ధి ధ్యేయంగా సాగింది. ఎక్కడా లేని విధంగా తన నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేశారు.
ప్రభుత్వ పాఠశాలను సర్వ హంగులతో తీర్చిదిద్దారు. ఒకప్పుడు ఆ స్కూల్లో జనాలు లేని స్థాయి నుంచి ఇప్పుడు సీటు కోసం రికమండేషన్ దాకా పరిస్థితి వచ్చిందంటే అదంతా కిషన్ రెడ్డి చొరవనే. అంతేకాదు కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నిధులు కేటాయించి అదనపు గదుల నిర్మాణానికి సహకారం అందించారు.
ఇలా ఒక్కటని కాదు అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ను కిషన్ రెడ్డి ఓ రోల్ మోడల్గా తీర్చిదిద్దారంటే అతిశయోక్తి కాదు. ఇక ఎవరూ పట్టించుకోని బర్కత్పురా చమన్ ను కిషన్ రెడ్డి అభివృద్ధి చేశారు. ఆయన ఏర్పాటు చేయించిన లైటింగ్ రాత్రి పూట ఆ ప్రాంతంలో వెలుగులు విరజిమ్ముతోంది. పలుచోట్ల సీసీ కెమెరాలు, బస్తీవాసులకు సంక్షేమ పథకాలు.. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయి.
బొకేలు, పూలదండలు వద్దు.. నోట్ బుక్స్ ఇవ్వండి
సికింద్రాబాద్ ఎంపీగా గెలవడంతో బర్కత్పురాలోని కిషన్ రెడ్డి నివాసం అభిమానులు, సన్నిహితులతో కిటకిటలాడుతోంది. అయితే ప్రతి ఒక్కరు బొకేలు, పూలదండలతో వచ్చి అభినందనలు తెలుపుతుండటంతో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు.
ఎంపీగా గెలిచిన తనను అభినందించడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న మిత్రులకు వినమ్రపూర్వకమైన విజ్ఞప్తి చేశారు. తనకు నిరాడంబరంగా ఉండటమే ఇష్టమని.. ఖరీదైన పూలదండలు, బొకేలు, శాలువాలు, స్వీట్లు తెచ్చే బదులు నోట్ బుక్స్ తీసుకురావాలని కోరారు. తద్వారా పేద విద్యార్థులకు మేలు చేసినవారవుతారని పేర్కొన్నారు. నన్ను ఆశీర్వదించడానికి ఖరీదైన వస్తువులు అవసరం లేదని.. అభిమానంతో నోట్ బుక్స్ ఇవ్వాలని సూచించారు. ఆ విధంగా ఒక ఆదర్శవంతమైన విధానానికి నాంది పలుకుదామంటూ పోస్ట్ చేశారు.
హ్యాట్సాఫ్ కిషన్ రెడ్డి.. అభిమానుల అభినందనలు
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆ నోట్ బుక్స్ అందించాలనేది ఆయన అభిమతం. కిషన్ రెడ్డి నిర్ణయంతో ఆయన మనసు తెలిసినవారు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆయన కోరిక మేరకు నోట్ బుక్స్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. నిరాడంబరతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే కిషన్ రెడ్డి మంచి మనసును పలువురు అభినందిస్తున్నారు. ప్రతి ఒక్క నేత ఆయనలాగే ఆలోచిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్సాఫ్ కిషన్ రెడ్డి అంటూ ఆశీర్వదిస్తున్నారు.
67 ఏళ్లుగా నో ఎంట్రీ.. మొత్తానికి బీజేపీ బోణి కొట్టిందిగా..!