ఆ ఏర్పాట్లతో ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై బిగ్ అప్డేట్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రైల్వే స్టేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రైల్వే స్టేషన్ ను ఎయిర్పోర్ట్ తరహాలో మార్చే పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.714.73కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ ప్రాజెక్టు డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం భారీగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లు
ప్రస్తుతం ప్రతీరోజూ సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుండగా, 180 వరకు రైళ్లు వచ్చిపోతున్నాయి. స్టేషన్ ఆధునీకరణ పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం భారీగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్లో రెండు పార్కింగ్ లాట్లలో మొత్తం 200 ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.

వాహనాలను స్టేషన్లో పార్క్ చేసి, ఛార్జ్ చేసుకునేలా ప్లాన్
బోయిగూడ వైపు బేస్మెంట్ పార్కింగ్లో 120 పాయింట్లు ఉంటాయి. వీటిలో ఫోర్ వీలర్లకు 100, టూ వీలర్లకు 20 కేటాయించారు. గణేశ్ టెంపుల్ వైపు నిర్మిస్తున్న మల్టీ లెవెల్ పార్కింగ్లో 80 పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 60 ఫోర్ వీలర్లకు, 20 టూ వీలర్లకు ఈవీ చార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ సదుపాయం వల్ల ప్రయాణికులు తమ వాహనాలను స్టేషన్లో పార్క్ చేసి, ఛార్జ్ చేసుకుని సులభంగా ప్రయాణం చేయవచ్చు.
మరో తొమ్మిది రైల్వే స్టేషన్లలో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు ఛార్జింగ్ టెన్షన్ తగ్గి, సమయం ఆదా అవుతుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదం చేస్తుంది. హైటెక్ సిటీ, నెక్లెస్ రోడ్, ఫిరోజ్గూడ, సుచిత్ర సర్కిల్, నేరేడ్మెట్, హఫీజ్పేట, బేగంపేట, ఉమ్దానగర్, సీతాఫల్మండి వంటి మరో తొమ్మిది రైల్వే స్టేషన్లలో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఎయిర్పోర్ట్ తరహా అనుభవాన్ని అందించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
స్టేషన్ పునర్నిర్మాణంలో మల్టీ లెవెల్ పార్కింగ్, స్కైవాక్ల ద్వారా మెట్రో స్టేషన్లకు అనుసంధానం, సోలార్ పవర్ ప్లాంట్, ఆధునిక వెయిటింగ్ హాళ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ తరహా అనుభవాన్ని అందించేలా రూపొందించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోని అత్యాధునిక రైల్వే హబ్లలో ఒకటిగా నిలవనుంది.












Click it and Unblock the Notifications