మునుగోడులో ఎమ్మెల్యే సీతక్క ప్రచారం.. పాల్వాయి స్రవంతికి జనం మద్దతు కోసం సెంటిమెంట్ అస్త్రం!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారంలో జోరుగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేసిన సీతక్క ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూకుడుగా పాల్గొంటున్నారు. సెంటిమెంటుతో పక్కా ప్లాన్ గా జనం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మునుగోడు లో సీతక్క ఎన్నికల ప్రచారం.. సెంటిమెంట్ అస్త్రం
మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా అన్ని ప్రధాన పార్టీలలో ఇప్పటికే రాష్ట్రంలోని ముఖ్య నేతలందరూ మునుగోడు బాటపట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సీతక్క కూడా మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మునుగోడు ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఒక్కదాన్నే ఆడమనిషిని ఉన్నానని, తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తున్నానని, తనతో పాటు పాల్వాయి స్రవంతిని కూడా అసెంబ్లీకి పంపితే, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను కూడా కష్టపడుతుంది అని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మహిళలకు అవకాశం ఇస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది అని చెబుతూ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఉపాధి హామీ చట్టం తెచ్చి పేదలను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీనే
అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ప్రజల కోసం అనేక మంచి పనులు చేసిందని ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. కానీ కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాలు పేదలకు పన్నులు పెంచి పెద్దలకు దోచి పెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. పేదల కడుపు నింపడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టం తెచ్చి వందరోజుల పని కల్పించిందని ఎమ్మెల్యే సీతక్క గుర్తుచేశారు. బడి తెచ్చిన, గుడి తెచ్చిన, రోడ్డు వేసిన, బస్సు వచ్చినా అవి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవేనని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపోయారు.. కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన సీతక్క
ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు, ప్రశ్నించే గొంతుకలు మనకు కావాలి అని పేర్కొన్నారు. కొంతమంది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలు మారారని, అధికార పార్టీల కు దాసోహం అయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే పార్టీలో ఉండడం ఎంతో గౌరవమని పేర్కొన్న సీతక్క ప్రజల కోసం పని చేసే వారికే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ లో గెలిచిన కొందరు అమ్ముడుపోయారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న సీతక్క కానీ తాము అలా కాదని, మీ కోసమే పని చేస్తాం అంటూ ప్రజలకు మాట ఇచ్చారు.
పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వాలని కోరిన సీతక్క
పాల్వాయి స్రవంతికి అవకాశం ఇస్తే మునుగోడు సమస్యలన్నీ తీరుస్తామని ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు. అమ్ముడు పోయేవాళ్ళు ప్రజల కోసం ఏం పని చేయగలరు అని ప్రశ్నించిన సీతక్క, పాల్వాయి స్రవంతికి అవకాశమిచ్చి ఆత్మగౌరవానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడులో ఎమ్మెల్యే సీతక్క ప్రజలలో మమేకం అవుతూ ప్రచారం సాగిస్తున్నారు.