మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత- నారా లోకేష్, రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అమరచింత నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994, 1999 ఎన్నికల్లో అమరచింత నుంచి ఘన విజయం సాధించారు. ఆ నియోజకవర్గం రద్దయిన తరువాత మక్తల్ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. ఇక్కడి నుంచి ఒకసారి గెలిచారు.

రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఓటమి చవి చూశారు. 2014, 2018 ఎన్నికల్లో మూడోస్థానానికే పరిమితం అయ్యారు. 2018 ఎన్నికల తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అనారోగ్యం బారిన పడటం వల్ల పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటూ వస్తోన్నారు.
కొద్దిరోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి శ్రేయస్సు కోసం పని చేసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆయన మరణం తీరని లోటుగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications