కాంగ్రెసు సంస్కృతి: రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్న సీనియర్లు
కాంగ్రెసులో చేరి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కోవాలని భావించిన రేవంత్ రెడ్డికి ఆటంకాలు తప్పడం లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ సంస్కృతి ఆయనకు చుక్కలు చూపిస్తన్నట్లు ప్రచారం జ
హైదరాబాద్: కాంగ్రెసులో చేరి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కోవాలని భావించిన రేవంత్ రెడ్డికి ఆటంకాలు తప్పడం లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ సంస్కృతి ఆయనకు చుక్కలు చూపిస్తన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పలువురు సీనియర్లు ఆయనకు సహకరించడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టి తిరుగులేని నాయకుడిగా కాంగ్రెసులో ఎదగాలని భావించారు. కానీ అది ఎంతవరకు ముందు పడుతుందనేది సందేహంగానే ఉంది.
తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుని ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. కానీ, ఆ తర్వాత ఆయన గొంతు పెద్దగా వినిపించడం లేదు.
పాదయాత్ర చేసి...
తెలంగాణలో పాదయాత్ర చేసి కెసిఆర్కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రజలను కూడగట్టాలని భావించారు. కాంగ్రెసులో చేరిన తర్వాత ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినట్లు సమాచారం. అయితే, అది ముందు పడడంలేదు. పలువురు సీనియర్లు ఆయనను అంగీకరించడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండలు..
రేవంత్ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండలు ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ను ఓడించడానికి ఆయన తురుపుముక్కగా పనికి వస్తారనే భావన ఆయనలో ఉందని చెబుతారు. కానీ, ఆయన మిగతా నాయకులను ఏకతాటి మీదికి తేగలరా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
డికె అరుణ ససేమిరా...
రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ మంత్రి డికె అరుణ ఏ మాత్రం సహకరించడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. అదే సమయంలో మరో మాజీ మహిళా మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా అరుణ దారిలో నడవాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. మిగతా నాయకులు ఎవరు కలిసి వస్తారనేది చెప్పడం కష్టమేనని అంటున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ దారే వేరు...
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ దారే వేరుగా కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. రాహుల్ గాంధీ మాటను కాదనలేక వారు మౌనంగా ఉన్నారు. వారు కొత్త రాజకీయ పార్టీ పెడుతారనే ప్రచారం కూడా సాగుతోంది. సిఎల్పీ నాయకుడు కె జానారెడ్డి మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. పలువురు సీనియర్ నేతలు కూడా మౌనంగానే ఉన్నారు.