తెలంగాణాలో ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేలో సంచలన విషయాలు; ఎన్నికలొస్తే.. టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కోసం రంగంలోకి దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు, కెసిఆర్ పాలన తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే సర్వేలను మొదలు పెట్టారు. ఈ క్రమంలో పీకే టీం చేస్తున్న సర్వేలు టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉండబోతుంది అన్న ఆసక్తికర విషయాలు ప్రశాంత్ కిషోర్ టీం నిర్వహిస్తున్న సర్వేలో వెలుగులోకి వస్తున్నాయి.

తెలంగాణాలో రంగంలోకి దిగిన పీకే టీమ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు రెండు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవడం వ్యూహంగా పావులు కదుపుతోంది. ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల పైన కూడా దృష్టి సారించడం ప్రధానంగా కనిపిస్తుంది. గత రెండు దఫాల ఎన్నికలలో విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ, ఈ సారి జాతీయ రాజకీయాలలో కూడా కీలకంగా మారాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ ను రంగంలోకి దింపింది.

టీఆర్ఎస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టడం లో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా కీలకంగా పని చేశారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కోసం పని మొదలు పెట్టిన ప్రశాంత్ కిషోర్ తన టీమ్ ను రంగంలోకి దింపారు.

తెలంగాణలో 22 రకాల సర్వేలు చేపట్టిన ప్రశాంత్ కిషోర్ టీమ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ 22 రకాల సర్వేలను నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, ఎంపీల పనితీరు, రైతులు, కులాల వారీగా ప్రజల సమస్యలు, వారి ఓట్ల ప్రభావం, తదితర అంశాలపై పీకే టీం సర్వే చేస్తోంది. ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహిస్తున్న సర్వేలో టిఆర్ఎస్ పార్టీ వైఖరిపై ఉద్యమకారులు తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఉద్యమకారులను పక్కనపెట్టిన టీఆర్ఎస్, ఉద్యమకారుల అసహనం
2014లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉద్యమకారులకు పట్టం కడుతుంది అని భావిస్తే, అందుకు భిన్నంగా తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి కీలక పదవులను ఇచ్చి పట్టం కట్టడాన్ని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కెసిఆర్ ఆదేశాలతో ఉద్యమ సమయంలో డబ్బు ఖర్చుపెట్టి, పోరాటం చేసిన వారికి ఎలాంటి ప్రాధాన్యత ప్రస్తుతం లేదని, గతంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా ఇప్పుడు పదవులను అనుభవిస్తున్నారని మండిపడుతున్నారు.

ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఏమిటి?
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో, ఇతర పార్టీల నుండి వచ్చిన వారు పదవులు పొంది ఆధిపత్యం చెలాయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులు అధికారులను ఇబ్బంది పెడుతున్నారని, వారిపై పెత్తనం చేస్తున్నారని, పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని పీకే టీం సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఏమిటి అన్న దానిపై కూడా సర్వే నిర్వహించిన పీకే టీం తెలంగాణ ప్రజలలో టిఆర్ఎస్ పార్టీ పట్ల అనేక విషయాలలో ప్రజలనుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని గుర్తించారు.
Recommended Video

పార్టీలో నేతల మధ్య కోల్డ్ వార్, ఎన్నికలు వస్తే కష్టమేనా
ఇదే సమయంలో పార్టీలో జిల్లాల వారీగా గ్రూప్ తగాదాలు ఉన్నట్టుగా సర్వే టీం పేర్కొంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతినే అవకాశం లేకపోలేదని ప్రశాంత్ కిషోర్ టీం తమ సర్వే నివేదిక ద్వారా తేల్చి చెబుతోంది. మరి ఇలాంటి పరిస్థితులలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టడానికి తన పంథాను మార్చుకుంటుందా? ఉద్యమకారుల వ్యతిరేకతను ఏమేరకు తగ్గించగలుగుతుంది? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications