పోటా పోటీగా - క్రెడిట్ గేమ్ : అమిత్ షా వర్సస్ కేసీఆర్ - నేడు ఇలా..!!
సెప్టెంబర్ 17. ఈ రోజు తెలంగాణలో ఒక ప్రత్యేకత కలిగిన రోజు. రాజకీయంగా తమ పట్టు నిరూపించుకొనేందుకు పార్టీలు పోటీ పడి..కార్యక్రమాలకు సిద్దమయ్యారు. అందులో భాగంగా..అన్ని పార్టీలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహణకు సిద్దమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు. రాజధాని హైదరాబాద్లో ప్రధాన కార్యక్రమం జరగనుంది. పబ్లిక్ గార్డెన్స్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
పెరుగుతున్న పొలిటికల్ హీట్
వేదికపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండా ఎగరవేసి గౌరవవందనం స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల పరిధిలోని కార్యాలయాల్లోనూ జాతీయజెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఇవాళ సాధారణ సెలపు ప్రకటించారు.
అటు కేంద్ర మంత్రి అమిత్ షా పెరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం తొలి సారిగా అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహిస్తోంది. స్వయంగా కేంద్ర హోం మంత్రి హాజరవుతున్నారు. కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు.
అమిత్ షా వర్సస్ కేసీఆర్
ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. పార్టీ పరంగానూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ స్వాతంత్ర్యం వేడుకల పేరుతో కార్యక్రమాలను ఖరారు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలతో విగ్రహాలను సిద్దం చేసారు. అయితే, పార్టీ సీనియర్ల నుంచి వచ్చిన భిన్నాభిప్రాయాలతో విగ్రహాల ఆవిష్కరణ వాయిదా వేసారు.
పార్టీ కార్యాలయంతో పాటుగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అసలు..నాటి పోరాటంలో కమ్యూనిస్టులే కీలక పాత్ర అని చెబుతున్న వామపక్షాల నేతలు ప్రత్యేకంగా తమ కార్యక్రమాలకు రూప కల్పన చేసారు. చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి సీపీఎం ర్యాలీ నిర్వహణకు సిద్దమైంది.
అన్ని పార్టీలు సమాయత్తం
మధ్నాహ్నం బంజారాహిల్స్ లో గిరిజన భవన్ కెసిఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్నాహ్నం.. నక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ రోడ్ వరకు సాంసృతిక ర్యాలీ కొనసాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా..ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజున జరిగే కార్యక్రమాల్లో చేసే ప్రసంగాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సెప్టెంబర్ 17ను తమ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న బీజేపీ - టీఆర్ఎస్ పొలిటికల్ క్రెడిట్ గేమ్..నేడు కొత్త టర్న్ తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.