ఆలుగడ్డ శీనూ! దమ్ముంటే నా చరిత్ర బయటపెట్టు: షబ్బీర్, గవర్నర్పై నారాయణ
హైదరాబాద్: ఆలుగడ్డ శీను కంటే తాను సీనియర్ను అని, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే తన చరిత్రను బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సవాల్ చేశారు.
తలసాని సంగతి ప్రజలకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. తలసాని దొంగమాటలను ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదన్నారు. రాజీనామా విషయం చెప్పమంటే బ్లాక్ మెయిల్ చేసే మాటలు మాట్లాడుతూ, అసలు విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నారన్నారు.

తాము భయపెడితే భయపడేవాళ్లం కాదన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణను అమ్మేందుకు కెసిఆర్ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ధనిక రాష్ట్రమని కెసిఆర్ చెప్పుకోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, పార్టీ మారిన వారిని కలిసేందుకు సమయం ఉంటుంది కానీ సచివాలయం వచ్చేందుకు కెసిఆర్కు తీరిక లేదా అని ప్రశ్నించారు.
గుదిబండలా గవర్నర్: నారాయణ
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలుగు ప్రజలకు గుదిబండలా మారారని సిపిఐ నేత నారాయణ వేరుగా మండిపడ్డారు. ఏ విషయం పైన అయినా సరైన సమయంలో నిర్ణయం తీసుకోని గవర్నర్ ప్రజల పాలిట గుదిబండ అయ్యారన్నారు.
వ్యాపం కుంభకోణంతో బిజెపి ఏమిటో తెలిసిందన్నారు. గోదావరి పుష్కరాల పేరుతో ఇరువురు ముఖ్యమంత్రులు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు, కెసిఆర్, జగన్ ఈ ముగ్గురు కావాలని కేంద్రం కోరుకుంటోందని, ఈ వైఖరే తెలుగు రాష్ట్రాల వివాదాలకు కారణమన్నారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కృషి చేయాలన్నారు. అవినీతి, క్రిమినల్ గ్యాంగులు కేంద్రాన్ని నడిపిస్తున్నాయన్నారు. గవర్నర్ను మార్చడం కాదని, ఆ వ్యవస్థనే మార్చాలన్నారు.
విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టులో పిటిషన్
విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టులో ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పిటిషన్ దాఖలు చేశారు. విభజన హామీలను అమలు చేయట్లేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాలపై విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని తెలిపారు. విభజన హామీలన్నీ అమలయ్యేలా ఆదేశించాలన్నారు.












Click it and Unblock the Notifications