షాకింగ్: ఏడాదిన్నర పాప మృతి కేసులో 11ఏళ్ల బాలిక, బురద నీటిలో పడేయడంతో చనిపోయింది
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డు జలవిహార్ సమీపంలో ఓ చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేసి హత్య చేశారు. పాపను చంపేసి జలవిహార్ పక్కనే ఉన్న నీటి గుంటలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను అప్పలనాయుడు కూతురుగా గుర్తించారు.
అంతకుముందే, తమ కూతురు తప్పిపోయిందని తల్లిదండ్రులు రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జలవిహార్ సమీపంలో నీటి గుంటలో చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో ఆమెను వారి కూతురుగా గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ కేసును దర్యాఫ్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
ఆ పాపను చంపేసింది పదకొండేళ్ల బాలిక అని తెలిసి పోలీసులే విస్తుపోయారు. తనను కొరికిందన్న కోపంతో కక్ష గట్టి, ఆ బాలిక పగ తీర్చుకోవడం కోసం నీటి గుంటలో పడేసింది. చిన్నారి మురికి నీటిలో మునిగి ఆ నీటిని మింగడం వల్ల చనిపోయింది. మొదట పాపను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఆ పదకొండేళ్ల బాలిక చెప్పిందని తెలుస్తోంది.
పోలీసులను ఆమె 12 గంటలపాటు ముప్పుతిప్పలు పెట్టింది. పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. దీంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. చిన్నారిని హత్య చేసిన బాలికను పోలీసులు జువైనల్ హోంకు తరలించారు.