ప్రభాకర్ మృతికి ఏసీపీనే కారణమా?: భార్య, తల్లి ఏమన్నారంటే?
పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ ప్రభాకర్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు.
హైదరాబాద్/భువనగిరి: పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ ప్రభాకర్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తల్లి వెంకటమ్మ, భార్య రచన, సోదరుడు భాస్కర్రెడ్డిలు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూరులో వారు మీడియాతో మాట్లాడారు.

నిజాలు దాస్తున్నారు..
పోలీసులు నిజాలను దాస్తున్నారని.. ఉన్నతాధికారుల తీరువల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లుగా ఆయన చెప్పేవారని ప్రభాకర్ రెడ్డి తల్లి వెంకటమ్మ, భార్య రచన, సోదరుడు భాస్కర్రెడ్డిలు తెలిపారు. ఏసీపీ ఒత్తిడికి తట్టుకోలేక.. బదిలీ చేయించుకుంటానని, కొద్దిరోజుల్లో ములుగుకు బదిలీ అవుతానంటూ చెప్పారని ప్రభాకరరెడ్డి భార్య వెల్లడించారు.

ఎన్నో అనుమానాలు
సంఘటన స్థలంలో మృతదేహం పడి ఉన్న తీరు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోందని, తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా లేదని అన్నారు. తమను మృతదేహం వద్దకు వెళ్లనివ్వలేదని ఆరోపించారు.

ఏసీపీకి నెలకు రూ. లక్ష..
తల్లి వెంకటమ్మ, సోదరుడు భాస్కర్రెడ్డిలు మాట్లాడుతూ.. ఏసీపీ తరచూ డబ్బుల కోసం వేధిస్తున్నట్లుగా తమతో చెప్పేవాడని అన్నారు. నెలకు రూ. లక్షల ఇవ్వాలంటూ వేధించారని చెప్పారు. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఇటీవల ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రస్తావించారని తెలిపారు.

తప్పుదోవ పట్టించారు..
కొంతమంది ప్రజాప్రతినిధులకు పోలీసుస్టేషన్ల నుంచి మామూళ్లు అందుతున్నాయని, దానిని కప్పిపుచ్చేందుకు ఎస్ఐ ప్రభాకరరెడ్డి ఆత్మహత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగురైతు అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. అందుకే బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారయత్నం చేసి చనిపోయినట్లుగా ప్రభాకరరెడ్డిపై నిందవేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications