క్షీణించిన సిద్ధయ్య ఆరోగ్యం: జగన్, కేసీఆర్ పరామర్శ
హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్ధయ్య పరిస్ధితి విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్ధితిపై కామినేని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సిద్ధయ్య ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని, ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కూడా వైద్యానికి సహకరించడం లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు.
ఇక, కామినేనిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్ధయ్య, సీఐ బాలగంగాధర్ రెడ్డిలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎల్. రమణ, మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావులు మాట్లాడారు.
కాల్పుల ఘటనపై మొదటి రోజే స్పందించి ఉంటే, పరిస్ధితి ఇక్కడి వరకు వచ్చే ఉండేదికాదన్నారు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో చినపోయిన పోలీసుల కుటుంబాలకు హోదాతో సంబంధం లేకుండా రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికి ఒక ఉద్యోగంతో పాటు, మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని అన్నారు.
సిద్ధయ్య ప్రాణాలను కాపాడేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడొద్దని సూచించారు. అవసరమైతే విదేశాల నుంచి వైద్య నిపుణులను తెప్పించాలన్నారు. ఇప్పటికైనా పోలీసు శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు లేవని, తీవ్రవాదుల వద్ద ఆధునిక ఆయుధాలున్నాయని తెలిసినా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ప్రజల మనిషైతే, బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు. ఉగ్రవాదులను దొపిడీదారులంటూ హోం మంత్రి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు.
సీఐ బాలగంగాధర్ రెడ్డి డిశ్చార్జి:
నల్గొండ జిల్లా జానకీపురం వద్ద ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ బాలగంగాధర్ రెడ్డిని వైద్యులు డిశ్చార్జి చేశారు.
ఎస్ఐ సిద్ధయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శ
కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్ధయ్య కుటుంబాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరామర్శించారు. అదే ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధయ్య భార్య ధరణిషను కూడా జగన్ పరామర్శించారు.
ఎస్ఐ సిద్ధయ్య కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శ
ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్ధయ్య కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. వైద్యులను అడిగి సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.