మౌనం కొన్ని సార్లు వ్యూహాత్మకమైతే కొన్ని సార్లు ప్రమాదం.!రాహుల్,అమిత్ షా అంశంలో కేసీఆర్ నైజం ఏంటి?
హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొత్త నీరు ప్రవహిస్తే పాత నీరు వెళ్లిపోతుంది అన్నట్టు కొత్త తరాలకు అనుగుణంగా సరికొత్త రాజకీయ నేతలు ఉద్బవిస్తుంటాయి. మారుతున్న కాలంతో పాటు అభిప్రాయాలను మార్చుకొని ప్రజల ఆలోచనా విధానాలకు అనుగుణంగా వ్యవహరించే వాడే రాజకీయ చాణక్యం నెరపగడని అనేక సందర్బాలు నిరూపించాయి. రాజకీయాల్లో ఓ టాస్క్ విజయవంతంగా ముగించాం మరో టాస్క్ తో పనిలేదనే వ్యవహారం స్వల్పకాలిక ప్రయోజనాలిస్తాయి తప్ప దీర్గకాలిక ప్రయోజనాలు అందించవు అనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో రాహుల్, అమీత్ షా పర్యటనలు.. మౌన వ్రతంలో కేసీఆర్
రాజకీయాల్లో సందర్బం వచ్చినప్పుడు స్పందించకపోతే ప్రజల్లో అనేక సందేహాలు కలిగించడమే కాకుండా కనుమరుగయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. రాహుల్ గాంధీ, అమీత్ షా పర్యటనల సందర్బంగా సీఎం చంద్రశేఖర్ రావు మౌనం దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. వీరిరువురూ తెలంగాణ గడ్డ మీద సీయం చంద్రశేఖర్ రావు పరిపాలనను తీవ్రస్థాయిలో విమర్శించడమే కాకుండా అనేక అరోపణలు గుప్పించినప్పటికి చంద్రశేఖర్ రావు పెదవి విప్పడం లేదు. మంత్రులు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావుతో కౌంటర్ ఇప్పించే ప్రయత్నం చేసినా సీఎం స్ధాయిలో ఉండదనే చర్చ జరుగుతోంది.
రాహుల్, అమీత్ షా తీవ్ర ఆరోపణలు.. ఏమాత్రం స్పందించని కేసీఆర్..
ఏఐసిసి మాజీ అద్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమీత్ షా సాదా సీదా రాజకీయ నాయకులు కాదు. రెండు జాతీయ రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైన నేతలు. అవసరం అనుకుంటే పార్టీ పగ్గాలను సునాయాసంగా చేపట్టగల సత్తా ఉన్న నాయకులు. ఆ స్థాయి నేతలు తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధానాలను ఎండగడుతున్నా, అనేక ఆరోపణలు గుప్పిస్తున్నా చంద్రశేఖర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నరన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. తనను రాహుల్ గాంధీ, అమీత్ షా కన్నా పెద్ద రాజకీయ నేతలు విమర్శిస్తే చంద్రశేఖర్ రావు స్పందిస్తారా.?అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.
కేసీఆర్ మౌనం వెనక రహస్యం ఏంటి.?అంతుచిక్కని వ్యవహారమంటున్న గులాబీ నేతలు
రాహుల్ గాంధీ పర్యటన పైన, అమీత్ షా పర్యటన సందర్బంగా హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు ఒకరిద్దరు ప్రతిస్పందించినా పెద్దగా ప్రయోజనం ఉండదనే చర్చ జరుగుతోంది. వరంగల్ బహిరంగ సందర్బంగా రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు చంద్రశేఖర్ రావు బదులివ్వకుండా చిన్నా చితకా నేతలతో వివరణ ఇప్పించే ప్రయత్నం చేయడం ద్వారా చంద్రశేఖర్ రావులో ఖండించే గుణం, ఎదురించే తత్వం సన్నగిల్లిందా అనే సందేహాలు తెలంగాణ ప్రజల్లో నెలకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వంపైన, చంద్రశేఖర్ రావు విధానాలపైన అంతగా విరుచుకుపడుతున్నా స్వయంగా తాను స్పందించకుండా చిన్నా చితకా నేతలతో కౌంటర్ ఇప్పించడం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది.
పేలని మంత్రుల ఎటాక్.. రాహల్, అమీత్ షా కేసీఆర్ కు సాధారణ నేతలా.?
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు మౌనం అన్ని సందర్బాల్లో మంచిది కాదనే అంశం తెరమీదకు వస్తోంది. స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా అన్నీ అంశాలను కలుపుకుని రెండు మూడు గంటలు మీడియా ముందు ఏకరువు పెట్టడం అన్ని సందర్బాల్లో అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమీత్ షా పట్ల వలస పక్షులు వస్తుంటాయని హరీష్ రావు చేసిన కామెంట్ ను, రాహుల్ గాంధీ పట్ల రాసిచ్చింది చదివి, బిర్యానీ తిని వెళ్తాడని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు అంతాగా పట్టించుకోలేదని తెలుస్తోంది. జాతీయ స్ధాయి నాయకుల పట్ల చేసే విమర్శలు సిద్దాంతపరంగా ఉండాలి గానీ చౌకబారుగా ఉండకూడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రశేఖర్ రావు మౌనం కూడా అంత మంచిది కాదనే చర్చ జరుగుతోంది.