ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ఆరుగురు విద్యార్థులు గల్లంతు; రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఫెర్రీ ఘాట్ లో పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. సరదాగా ఫెర్రీ ఘాట్ కు వెళ్ళిన ఆరుగురు విద్యార్థులు ఫెర్రీ ఘాట్ వద్ద గల్లంతు కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. ఇక వీరిలో ఐదుగురు విద్యార్థులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు స్థానికులు కాపాడగా, ఒక విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది
ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కొండపల్లి బి కాలనీకి చెందిన పాఠశాల విద్యార్థులు స్నానం చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఫెర్రీ ఘాట్ వద్ద నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు గల్లంతయ్యారు. ఇక ఈ విషయం తెలియడంతో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల ఐదుగురిని కాపాడారు. మరో విద్యార్థి ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వీరందరూ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థి పేరు లోకేష్ గా తెలుస్తుంది. గల్లంతైన విద్యార్థి లోకేష్ కోసం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి విద్యార్థి కోసం గాలింపు చేపట్టాయి. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. దీంతో విద్యార్థి సురక్షితంగా బయట పడతాడా లేదా అన్న ఆందోళన అక్కడ ఉన్న స్థానికులు అందరిలో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదులకు వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో ఎవరూ నదులలోకి దిగకుండా దిగకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను వరద ఉధృతి నేపథ్యంలో అలర్ట్ చేశారు. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అటు కృష్ణానదికి కూడా వరద క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది.