పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ఆరుగురు టీచర్ల సస్పెన్షన్
జగిత్యాల: జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఆరుగురు టీచర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు.
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ మ్యాథ్స్ టీచర్.. వడ్లకొండ రమేశ్, రాంసాగర్ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్, కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారి.. మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధను సస్పెండ్ చేశారు.
ఇదీ జరిగింది...
కొడిమ్యాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని రెండు మూడు రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను బయటకు చెబుతున్నాడని.. సెల్ఫోన్లో ఫోటో తీసి బయటకు పంపుతున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో పక్కా సమాచారం మేరకు ఎస్ఐ సతీశ్ కుమార్ పరీక్ష కేంద్రం పక్కన ఉన్న కొంటూరి సతీశ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి గదిపై దాడి చేశాడు. గదిలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణ, మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వడ్లకొండ రమేశ్, మరో ఇద్దరు మహిళా టీచర్లు, ఇద్దరు బాలురు ప్రశ్నలకు జవాబులు రాస్తూ ఎస్ఐ కంటికి చిక్కారు.
దీంతో ఎస్ఐ సతీశ్.. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ప్రభుత్వ టీచర్ రమేశ్ను అదుపులోకి తీసుకున్నాడు. ఇంతలోనే మహిళా టీచర్లు పారిపోయారు. అనంతరం ఈ వ్యవహారంతో సంబంధమున్న మొత్తం ఆరుగురు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఈవో వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.