SLBC సొరంగ ప్రమాదం.. రంగంలోకి 'మార్కోస్', నేడు రెస్క్యూ ఆపరేషన్లో కీలకదశ!
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచిపోయినా, సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంతవరకు తెలియలేదు. ఈనెల 22వ తేదీన టన్నెల్ ప్రమాదం జరిగిన నాటి నుంచి గత నాలుగు రోజులుగా 8 మంది కార్మికులు లోపలే చిక్కుకునిపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు వీరి జాడ దొరకలేదు.
టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద ప్రతికూల పరిస్థితి
టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద పరిస్థితి అర్థం కాకుండా ఉండటంతో దీనిని అంచనా వేయడానికి 34 మందితో కూడిన సైన్యం, ఎన్డిఆర్ఎఫ్ ల ప్రత్యేక బృందం నిన్న సొరంగంలోకి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్టు వారు అంచనా వేశారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ను కదిలిస్తే టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని వారు చెప్పినట్టుగా తెలుస్తుంది.

చివరి 40 మీటర్లు సహాయక చర్యలకు సవాల్
ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయక చర్యలకు సవాల్ గా మారింది. టన్నెల్లో 15 అడుగుల ఎత్తులో పదివేల క్యూబిక్ మీటర్ల మీద బురద పేరుకుపోయిందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఆ బురదను బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దట్టమైన చీకటితో పాటు గాలి కూడా లేకపోవడంతో అక్కడ సహాయక చర్యలకు ఇబ్బంది నెలకొంది.
రంగంలోకి మార్కోస్
అధునాతన కెమెరాలను, పరికరాలను ఉపయోగించడానికి అవకాశం లేకుండా ఉంది. దీంతో కార్మికుల కోసం నేడు ఆపరేషన్ చేపట్టనున్నారు. నేల మీదైనా, నీటి మీదైనా, ఆకాశంలోనైనా, ఎక్కడైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ సభ్యులని మార్కోస్ అని పిలుస్తారు. కార్గిల్ తో పాటు కాశ్మీర్ తదితర ప్రాంతాలలో ప్రతికూల పరిస్థితులలోనూ ఫలితాలను సాధించిన చరిత్ర మార్కోస్ టీంకు ఉంది.
మార్కోస్ తో పాటు బీఆర్వో టీం కూడా
మార్కోస్ తో పాటు బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ టీం కూడా సొరంగంలో చిక్కుకున్న వారి కోసం రంగంలోకి దిగుతుంది .గుట్టలు, పర్వత ప్రాంతాలు, సొరంగాల నిర్మాణాలు నిర్వహణ రికార్డ్ బీఆర్వో కు ఉంది. ఈ రోజు అత్యంత కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్నారు. దీని కోసం మార్కోస్ టీం రంగంలోకి దిగింది.












Click it and Unblock the Notifications