మరో స్పెషాలిటీ: స్మార్ట్ బైక్ స్టేషన్స్.. మెట్రో దిగాక అందుబాటులో.., కాలనీల్లోను..
హైదరాబాద్: హైదరాబాద్ కలల మెట్రో ప్రారంభోత్సవం వేళ స్మార్ట్ బైక్స్ కూడా సందడి చేయనున్నాయి. ప్రారంభోత్సవం జరగనున్న మియాపూర్ మెట్రో స్టేషన్ కు అనుబంధంగా తొలి బైక్ స్టేషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు.
మెట్రో స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణికులు మరో చోటుకు ప్రయాణించాలనుకుంటే ఈ స్మార్ట్ బైక్స్ లను ఉపయోగించుకోవచ్చు. మంగళవారం వీటిని అధికారికంగా ప్రారంభించనున్నారు.
250స్మార్ట్ బైక్స్:
మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు మొత్తం 250బైక్స్ ను జపాన్ నుంచి తెప్పించారు అధికారులు. ప్రస్తుతానికి 25 బైక్స్ మాత్రమే అందుబాటులో ఉండగా.. మిగతావి ఇంకా హైదరాబాద్ చేరుకోలేదు. జపాన్ టెక్నాలజీతో తయారైన ఈ స్మార్ట్ బైక్స్ అత్యాధునికమైనవని చెబుతున్నారు. బ్యాటరీలు, సౌరశక్తితో ఛార్జింగ్ ద్వారా ఈ బైక్స్ నడవనున్నాయి. తద్వారా కాలుష్యానికి కూడా ఆస్కారం ఉండదు. ఇక వీటి నిర్వహణను కంట్రోల్ రూం నుంచే పర్యవేక్షించనున్నారు.
స్మార్ట్ బైక్ స్పెషాలిటీస్:
మెట్రో ప్రయాణికులు స్టేషన్ లో దిగిన తర్వాత వీటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ లేదా, టీ సవారీ స్మార్ట్ కార్డ్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. తిరిగి వెనక్కి ఇచ్చేటప్పుడు కూడా వాటి ద్వారానే చెల్లింపులు జరపవచ్చు. లేదా డెబిట్, క్రెడిట్ కార్డులతోను చెల్లింపులు జరపవచ్చు.
స్మార్ట్ బైక్స్ ఆపరేట్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్తో దీనిని ఆపరేట్ చేయవచ్చు. ఈ బైక్స్ ను దొంగిలించడానికి అసలు అవకాశమే లేదు. బార్కోడింగ్, జీపీఎస్ల ద్వారా ఎక్కడున్నాయో వీటిని పసిగట్టవచ్చు.
100కోట్లతో 500స్టేషన్లు:
స్మార్ట్ బైక్స్ స్టేషన్ల కోసం ప్రభుత్వం రూ.100కోట్లు ఖర్చు చేసి, 500 బైస్కిల్ స్టేషన్స్ నిర్మించనుంది.వీటిల్లో 63 బైస్కిల్ స్టేషన్లను మూడు మెట్రో కారిడార్లలోని 63స్టేషన్లలో నిర్మించనుండా.. మిగతా వాటిని నగరంలోని వివిధ కాలనీల్లో నిర్మించనున్నారున తద్వారా కాలనీల్లో నుంచి స్మార్ట్ బైక్స్ ద్వారా నేరుగా స్టేషన్ కు చేరుకోవచ్చు.
అంతేకాదు, డర్ స్టేషన్ల నుంచి మెట్రో స్టేషన్లకు, షాపింగ్స్, వ్యక్తిగత అవసరాలకు వీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. దశలవారీగా ఈ ప్రాజెక్టును అధికారులు పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం మియాపూర్ బైస్కిల్ స్టేషన్ మాత్రమే అందుబాటులో ఉంది.
60నుంచి 100సైకిళ్లు:
ఒక్కో మెట్రో స్టేషన్లో 60 నుంచి 100 సైకిళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ఒక స్టేషన్లో తీసుకుని.. వినియోగించుకున్న తర్వాత అదే స్టేషన్లో.. లేదంటే ఇతర మెట్రోస్టేషన్లలో లేదంటే ఇతర ఫీడర్ స్టేషన్లలో ఎక్కడైనా అప్పగించవచ్చు. వీటి వినియోగం ద్వారా రోడ్లపై వ్యక్తిగత వాహనాలను తగ్గించడం.. తద్వారా కాలుష్యాన్ని నియంత్రించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.