సెక్యూరిటీ లేకుండా.. స్మృతి ఒక్కరే.. ఎక్కడకెళ్లారు?
న్యూఢిల్లీ : రాజకీయాల్లో కీలక స్థానాల్లో కొనసాగుతున్న వారికి భద్రత అనివార్యం. ఎక్కడికెళ్లినా..! ఏం చేసినా..! సెక్యూరిటీని వెంబడి పెట్టుకుని వెళ్లాల్సిందే. మొత్తంగా భద్రతా వలయంలోనే పర్యటనలు గానీ కార్యక్రమాలకు గానీ హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాత్రం సెక్యూరిటీని పక్కనబెట్టేసి ఢిల్లీ వీధుల్లో దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
కారణమేంటో తెలియదు గానీ.. పూర్తిగా సెక్యూరిటీని పక్కనబెట్టేసి ఢిల్లీ వీధుల్లో స్మృతి ఇరానీ ఒంటరిగా సంచరించినట్లు సమాచారం. న్యూఢిల్లీలోని స్టార్ బక్స్ కాఫీ పార్లర్ కౌంటర్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తూ కనిపించిన స్మృతిని రచయిత నిమిష్ గుర్తుపెట్టి తన కెమెరాతో క్లిక్ మనిపించడంతో.. ప్రస్తుతం ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
ఫోటో తీసిన అనంతరం దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో.. స్మృతి ఇరానీ ఢిల్లీ వీధుల్లో ఒంటరిగా సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ కాఫీ షాప్ కు స్మృతి ఇరానీ రెగ్యూలర్ కస్టమర్ అని తెలుస్తోంది. తరుచూ ఆ కాఫీ షాప్ కు వెళ్లే స్మృతి ఇరానీ లైన్లో నిలబడే తన కాఫీ ఆర్డర్ చేస్తుందట.