సభలో పాము కలకలం, కూలిపని చేస్తానని కెసిఆర్, జైలుకెళ్లొచ్చి: తలసాని
మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభలో పాము కలకలం చెలరేగింది. సభా ప్రాంగణంలోకి పాము వచ్చింది. దీంతో అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు.
అప్రమత్తమైన అధికారులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అది పుట్టలోకి వెళ్లిపోయింది. ఉదయం ఎర్రవల్లిలో పర్యటించిన కెసిఆర్ ఎర్రవల్లిలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎర్రవల్లి గ్రామమే తెలంగాణ తెచ్చింది: కెసిఆర్
తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే ఎర్రవల్లి గ్రామం అని కెసిఆర్ అన్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందరు కష్టపడితేనే రాష్ట్రం సిద్ధించిందన్నారు. అందరు కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నా ఎర్రవల్లి గ్రామం ఎందుకు అభివృద్ధి చెందడం లేదన్నారు.

మన ఇంటిని మనమే శుభ్రం చేసుకుంటామని, అలాగే మన గ్రామాన్ని మనమే శుభ్రం, అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రజలతోనే ఉండి తాను కూడా కూలి పని చేస్తానని చెప్పారు.
అవినీతి మచ్చ లేని సీఎం కేసీఆరే: మంత్రి తలసాని
కెసిఆర్ అవినీతి మచ్చలేని ముఖ్యమంత్రి అని మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.
ప్రజల గురించి ఆలోచించకుండా రాద్ధాంతం చేయడం ఒకటే వారికి తెలుసునని, ఏదైనా తప్పు జరిగితే సూటిగా చెప్పాలని, సరి చేసుకుంటామన్ననారు. బట్ట కాల్చి మీద వేస్తామంటే ఊరుకోమన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎక్కడైనా అమలు కావడం లేదా అని ప్రశ్నించారు.
రైతాంగానికి తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరంతర విద్యుత్ ఇవ్వలేదని, ప్రతీ ఎకరాకు నీరందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. కర్ణాటకలోని గిరిజాపూర్ జలాశయం నిర్మిస్తే మహబూబ్నగర్ ప్రజలు ఇబ్బంది పడతారన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ నేతలు జలాశయ నిర్మాణం ఆపొచ్చు కదా అని సూచించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే సోనియా గాంధీతో మాట్లాడి కృష్ణా నదిపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీని ఆపించాలన్నారు.
కొత్త సచివాలయం కడుతామన్నా, హుస్సేన్ సాగర్ క్లీన్ చేస్తామన్నా విమర్శలు చేస్తారని, ఇందిరమ్మ ఇండ్లు కట్టకముందే కాంగ్రెస్ నేతలు డబ్బులు నొక్కేశారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకే గ్రామజ్యోతి అన్నారు.
కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని దోచుకున్న దొంగలన్నారు. చీఫ్ లిక్కర్ వల్ల గౌడ కులస్థులకు నష్టం జరగదని, దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా ఇంటింటికీ చెత్త డబ్బాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications