2019 లోక్సభ ఎన్నికల్లో అందుకే ఓటమిపాలయ్యా: డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి సోషల్ మీడియా కీలకంగా మారింది. మీడియా కంటే కూడా ముందుగా సమాచారాన్ని చేరవేస్తూ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎవరో కొందరు దుర్వినియోగం చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియా పాత్ర మాత్రం ప్రస్తుతం సమాజంలో ఎంతో ఉందని చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకైతే సోషల్ మీడియా ఎంతో ముఖ్య ప్రచారాస్త్రంగా మారింది.

సోషల్ మీడియాపై డీకే అరుణ..
ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకుని పథకాలను ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీల కార్యకలాపాలకు కూడా సోషల్ మీడియా అంతులేని సేవలందిస్తోంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతల గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయికి ఇప్పుడు సోసల్ మీడియా ఎదిగిందంటే.. అతియోశయోక్తేమీ కాదని చెప్పాలి. తాజాగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

సోషల్ మీడియాతోనే పథకాల ప్రచారం చేయాలన్న డీకే అరుణ
బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో ముందుంటుందనే విషయం తెలిసిందే. కాగా, శనివారం సోషల్ మీడియా ఇంఛార్జుల జాతీయ వర్క్షాప్ను నిర్వహించారు. సోషల్ మీడియాను ఉపయోగించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ మాట్లాడుతూ సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతోపాటు పార్టీ కార్యక్రమాలను అందరిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యనభ్యసించనివారు కూడా సోషల్ మీడియాను వాడుతున్నారన్నారు. వ్యాక్సినేషన్పై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా వేదకగా తిప్పికొట్టాలని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
Recommended Video

2019 లోక్సభ ఎన్నికల ఓటమికి సోషల్ మీడియానే..: డీకే అరుణ
తాను 2019లో మహబూబ్నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోవడానికి సోషల్ మీడియాను సరిగా ఉపయోగించుకోకపోవడమే కారణమని డీకే అరుణ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో చేరకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు తెలిపిన ఆమె.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా సేవలందించినట్లు చెప్పారు. 2019 ఎన్నికల ముందు బీజేపీలో చేరినట్లు తెలిపారు. అయితే, ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం, సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో తాను ఓడిపోయానని డీకే అరుణ తెలిపారు. అంతేగాక, తాను పార్టీ మారిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications