భార్య, కుమార్తెతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. దేవుని గదిలో పటాలు చిందరవందరగా, నుదిటిపై పెద్ద బొట్లు
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య, కుమార్తె తో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. మృతుల నుదుట పెద్ద బొట్లు, దేవుని గదిలో పటాలు చిందరవందరగా పడి ఉండడంతో ఈ మృతిపై పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో కుటుంబంతో సహా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీరంగూడ లో గురువారం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్య, కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి ఇంటికి వెళ్లి చూడగా తల్లి, కూతురు పురుగుల మందు తాగి మరణించగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రీకాంత్ గౌడ్ సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. మృతుడు టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ (42), అతని భార్య అనామిక, వారి ఏడేళ్ల కుమార్తెగా గుర్తించారు.
ఇంట్లో లోపల తాళం వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం
ఈ కేసు వివరాల్లోకి వెళితే, శ్రీకాంత్ గౌడ్ , అనామిక 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి శ్రీ స్నిగ్ధ అనే ఏడు సంవత్సరాల పాప ఉంది. శ్రీకాంత్ గౌడ్ టీసీఎస్ లో ఉద్యోగి కాగా, భార్య అనామిక ఓ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అన్యోన్యంగా ఉన్న వీరి కాపురంలో ఏం జరిగిందో తెలీదు కానీ ఏకంగా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. అనామిక తన తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చి వారి ఇంటికి వెళ్లి చూడగా తలుపు లోపల నుంచి తాళం వేసి ఉంది.
మృతదేహాలపై బొట్లు, చిందరవందరగా ఇంట్లో దేవుడి పటాలు
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా తలుపులు తెరిచి చూశారు. అక్కడ కుటుంబసభ్యులు అందరూ శవాలై కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పని మనిషికి రెండు రోజుల ముందే రావద్దు అని చెప్పారని తెలుస్తోంది. మృతదేహాల పై బొట్లు, ఇంట్లో ఉన్న దేవుడు పటాలు చిందరవందరగా పడి ఉండడంతో అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య, కూతురు పురుగుల మందు తాగి మృతి చెందినట్టు గుర్తింపు
శ్రీకాంత్ గౌడ్ ముందు భార్య అనామిక, కూతురు శ్రీ స్నిగ్ధ లకు పురుగుల మందు తాగించి వారు మరణించిన తర్వాత, తాను కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. భార్య అనామిక, కూతురు శ్రీ సిద్ధ పురుగుల మందు తాగి నోటి నురుగు, ముక్కునుండి రక్తం వచ్చి మృతి చెందినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
వారు చనిపోయాక భర్త ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య
భార్యకు కూతురికి విషమిచ్చి వారు చనిపోయిన తర్వాత మృతదేహాల పై దుప్పటి కప్పి, అనంతరం వారిద్దరికీ పెద్ద బొట్లు పెట్టి తాను కూడా పెట్టుకొని మరో గదిలోకి వెళ్లి శ్రీకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితి, భార్యాభర్తల మధ్య ఏవైనా కుటుంబ కలహాలు ఉన్నాయా అన్న ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడే లా ప్రేరేపించిన వారి మానసిక స్థితి పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.