ఘోరం: చాలినంత కోడికూర వేయలేదని కన్నవారినే.. గొడ్డలితో...
కోడికూరలో ముక్కలు తక్కువయ్యాయన్న కోపంతో కడుపున పుట్టిన కొడుకు కన్నతల్లిదండ్రులనే కనికరం కూడా లేకుండా గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో చోటుచేసుకుంది.
సూర్యాపేట: జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో దారుణం చోటుచేసుకుంది. కోడికూరలో ముక్కలు తక్కువయ్యాయని కన్నతల్లిదండ్రులనే కనికరం కూడా లేకుండా కొడుకే వారిపై గొడ్డలితో దాడి చేశాడు.
ఈ అమానుష ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బానోతు తార్యా, సోమిలి దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. కొడుకులిద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. పెద్ద కొడుకు బానోతు శీనుకు 2012లో వివాహమైంది.
అయితే శీను ప్రవర్తన నచ్చకపోవడంతో పెళ్లైన ఆరు నెలలకే అతడి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. అప్పట్నించి శీను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఏదో ఒక పని చేయమంటూ శీనును అతడి తల్లిదండ్రులు కూడా తరచూ మందలిస్తూ ఉండే వారు. దీంతో వారిపై శీను కోపం పెంచుకున్నాడు.
శుక్రవారం రాత్రి ఇంట్లో కోడికూర వండారు. అన్నం తినేటప్పుడు తనకు కోడికూర ముక్కలు తక్కువగా వేశారంటూ శీను తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. నోటికొచ్చినట్లు తిట్టాడు. అనంతరం రాత్రి తమ్ముడు, మరదలు ఇంట్లో పడుకోగా.. శీను అతడి తల్లిదండ్రులు ఇంటి బయట పడుకున్నారు.
అందరూ నిద్రపోయాక శీను లేచి గొడ్డలి తీసుకుని తార్యాను కన్న తండ్రి అని కూడా చూడకుండా నరికాడు. అతడు నిద్ర లేచి తీవ్రమైన బాధతో అరవగా.. ఆ అరుపులకు శీను తల్లి సోమిలి లేచి అడ్డుకోబోగా, ఆమె తలపై కూడా నరికి శీను పరారయ్యాడు.
ఈ మేరకు సమాచారం అందుకోగానే పోలీసులు క్షతగాత్రులను 108 వాహనం ద్వారా సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సోమిలి పరిస్థితి విషమించడంతో ఆమెను హైదరాబాద్ కు తరలించారు. శీనును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అర్వపల్లి ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.