కష్టాలు తీరాయి: ఒక్క ఫోన్కాల్తో రైల్వే టికెట్ క్యాన్సిల్
న్యూఢిల్లీ: ఏప్రిల్ నుంచి ముందుగా రిజర్వేషన్ చేసుకున్న రైల్వే టికెట్లను రద్దు చేయడం సులభతరం కానుంది. కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా టికెట్లను రద్దు చేసుకునే సౌలభ్యాన్ని రైల్వే సంస్ధ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకువస్తోంది.
ప్రస్తుతం ముందుగా బుక్ చేసుకున్న టికెట్ను నిర్ణీత గడువులోపే రైల్వే కౌంటర్ వద్దకు వెళ్లి రద్దు చేసుకుని, టికెట్ నగదు తిరిగి తీసుకోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో రైల్వే శాఖ కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది.
ఈ నేపథ్యంలో 139 నంబర్కు డయల్ చేసి కన్ఫర్మ్ అయిన టికెట్ను రద్దు చేసుకోవచ్చు. ఇలా టికెట్ను రద్దు చేయడం ద్వారా ప్రయాణికుడికి మొబైల్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. అదే రోజు ఏ సమయంలోనైనా రైల్వే కౌంటర్ వద్దకు వెళ్లి ఓటీపీ తెలియజేయడం ద్వారా టికెట్ నగదుని వాపస్ తీసుకోవచ్చని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
టికెట్ రద్దు చేసుకుంటే, తిరిగి నగదు వాపసు పొందే నిబంధనలను ఇటీవల రైల్వేశాఖ మార్చింది. మార్చిన నిబంధనలు ప్రయాణికులకు ఎంతో కష్టంగా మారాయి. ముఖ్యంగా ప్రయాణికులు నిర్ణీత గడువు లోగా కౌంటర్ వద్దకు వెళ్లి కన్ఫర్మ్ అయిన టికెట్ను రద్దు చేసుకోవడం చాలా కష్టంగా మారింది.
ఈ క్రమంలో చాలా మంది రద్దు చేసుకున్న టికెట్ నగదుని తిరిగి తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికుల కష్టాలను తెలుసుకున్న రైల్వే శాఖ ఈ ఫోన్ నెంబర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు నిజంగా అవసరమున్న ప్రయాణికులకే రిజర్వేషన్ టికెట్ లభించేందుకు వీలుగా టికెట్ రద్దు చార్జీని కూడా రైల్వే శాఖ రెట్టింపు చేసింది.
ఇలా చేయడం ద్వారా అవసరం లేకుండా ముందుగా రిజర్వేషన్ చేసే వారికి, బ్లాక్ మార్కెట్లో రిజర్వేషన్ టికెట్లు అమ్మేవారికి చెక్ పడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. మరోవైపు ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసిన ప్రయాణికులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారానే టికెట్ను రద్దు చేయాల్సి ఉంటుంది.
139 నెంబర్ కేవలం రైల్వే కౌంటర్లో టికెట్ తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన సాప్ట్వేర్ను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు రైల్వే శాఖ అన్ని సన్నాహాలను పూర్తి చేసింది.