Rajdhani Express: రాజధాని ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు.. ! ఇకపై ఇలా..!
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ (హజరత్ నిజాముద్దీన్ )కు వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ (Rajdhani Express) ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా మండు వేసవిలో ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారి కోసం అదనంగా మరో కోచ్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల రద్దీని, వేసవిని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇకపై రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారు ఈ మార్పు గమనించాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్-హెచ్.నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ (12438/12437)కు ఇకపై అదనంగా ఓ ఫస్ట్ ఏసీ కోచ్ ను కలుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మార్పు నిజాముద్దీన్ నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 19వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ కోచ్ ఇకపై శాశ్వతంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ కు రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు (12437) ప్రతీ రోజూ మధ్యాహ్నం 12.50కు బయలుదేరుతుంది. ఇది ఇది మరుసటి రోజు ఉదయం 10.30కు నిజాముద్దీన్ కు చేరుకుంటుంది. అలాగే నిజాముద్దీన్ లో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3.35కు బయలుదేరే రాజధాని ఎక్స్ ప్రెస్ (12438) సికింద్రాబాద్ కు సోమవారం మధ్యాహ్నం 1.40కు చేరుకుంటుంది. జాతీయ రాజధాని నగరమైన ఢిల్లీని తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో కలిపే ప్రత్యేక రైలు ఇది.












Click it and Unblock the Notifications