తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు: రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగానే శనివారం తెలంగాణలోకి ప్రవేశించాయి. గత మూడేళ్లలో తొలిసారిగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రెండురోజుల ముందుగానే రావడం గమనార్హం.
తెలంగాణలోని వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు శనివారం ప్రవేశించాయని, ఆదివారం మరిన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు రోడ్లు జలమయ్యాయి. నైరుతి రుతుపవనాల రాకతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో మార్కెట్లో తరలించేందుకు ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాలు కూడా వర్షంలో తడవడంతో ఆందోళన చెందుతున్నారు.
ప్రతి ఏడాది జూన్ 1నే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. కానీ, ఈసారి మాత్రం రెండు రోజులు ఆలస్యంగా వచ్చాయి. అయితే, ఈ ఏడాది మాత్రం దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదు కానున్నాయి.