ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి ఊహించని పదవి కట్టబెట్టబోతున్న సీఎం కేసీఆర్...?
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అడిగిన వెంటనే పోటీకి ఒప్పుకుని ఎన్నికల్లో గెలిచినందుకు వాణీ దేవికి కీలక పదవి అప్పగించాలని సీఎం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ ఏ పదవి ఇవ్వబోతున్నారు...
సురభి వాణీ దేవికి ఎమ్మెల్సీ పదవి చిన్న హోదా అని... ఆమెను శాసనమండలి ఛైర్మన్ను చేస్తే సముచిత గౌరవం కల్పించినట్లు అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నో ఎన్నికలు గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం మాత్రం అందకుండా ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా సురభి వాణిదేవిని బరిలో దింపడంతో ఎట్టకేలకు ఆ స్థానం టీఆర్ఎస్ వశమైంది. నిజానికి కేసీఆర్ వాణీ దేవిని బలిపశువును చేయబోతున్నారన్న విమర్శలు చాలానే వినిపించాయి. అయినప్పటికీ వాణీ దేవి మాత్రం ధీమాగా బరిలో దిగి గెలిచి చూపించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు పెద్ద పదవి కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గుత్తా పదవి ముగిశాక...
ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి కాలం ఈ ఏడాది జూన్లో ముగుస్తుంది. వాణీ దేవిని మండలి ఛైర్మన్ను చేసి గుత్తాకు మరేదైనా పదవి సర్దుబాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డికి నాగార్జున సాగర్ ఉపఎన్నిక టికెట్ ఇవ్వొచ్చునని మొదట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన పేరు పరిశీలనలో లేనట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకే టికెట్ ఇస్తారని సమాచారం. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ లేదా మన్నె రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్లలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పీవీ కుమారుడికి కూడా పదవి..?
పీవీ నర్సింహారావు కుమారుడు ప్రభాకర్ రావుకు కూడా కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. గతేడాది జూన్ 28న పీవీ జయంతి సందర్భంగాప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ ఏడాది జూన్ 28వరకు కొనసాగనున్నాయి. పీవీకి,ఆయన కుటుంబానికి అన్ని విధాలా ప్రాధాన్యం కల్పించడం రాజకీయంగానూ టీఆర్ఎస్కు కలిసి వస్తోందనే చెప్పాలి.