మైండ్ దొబ్బిందా.. కరోనా కంటే దారుణంగా మారుతున్న మనుషులు..
ఓవైపు కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికా,ఇటలీ,స్పెయిన్ ఉదంతాలు చూస్తుంటే వెన్నులో వణుకుపుడుతోంది. ఆ పరిస్థితి భారత్కు రావొద్దని ఇక్కడి ప్రభుత్వాలు ప్రజలను నిత్యం చైతన్యం చేస్తూనే ఉన్నాయి.చాలామంది సినీ,రాజకీయ ప్రముఖులు కరోనాపై అవగాహన కల్పించేందుకు వీడియో మెసేజ్లు రిలీజ్ చేస్తున్నారు. ఓవైపు ఇంత ప్రయత్నం జరుగుతుంటే.. మరోవైపు లేనిపోని అపోహలు,పిచ్చి పిచ్చి చిట్కాలను ప్రచారం చేస్తూ కొంతమంది లేని గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇలాంటివాళ్లను ఉపేక్షించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హెచ్చరించినా.. ఈ ప్రచారాలకు మాత్రం తెరపడటం లేదు. తాజాగా హిజ్రాలను టార్గెట్ చేసుకుని వదిలిన కొన్ని వదంతులు కలకలం రేపుతున్నాయి.
హిజ్రాలపై దుష్ప్రచారం.. కరోనాకు ముడిపెడుతూ..
'కొజ్జా,హిజ్రాలను షాపుల దగ్గరకు రానివ్వకండి. వారితో మాట్లాడినా,సెక్స్ చేసినా కరోనా వైరస్ వస్తుంది. వారిని తరిమికొట్టడం లేదా 100కి ఫోన్ చేయండి. ప్రజలను కరోనా వైరస్ హిజ్రాల నుంచి కాపాడండి.' అంటూ అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రికే రాత్రే కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ట్రాన్స్జెండర్ల కార్యకర్త తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఇలాంటి పోస్టర్లే రాజ్భవన్ రోడ్ సిగ్నల్ సమీపంలోనూ చూసినట్టు మరో నెటిజన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశమంతా ఒక సంక్షోభ సమయాన్ని ఎలా గట్టెక్కాలా అని ఆలోచిస్తుంటే.. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మరింత గందరగోళ పెడుతున్నవారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్జెండర్లపై వివక్ష పెంచేలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ.. హింసకు ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైండ్ దొబ్బిందా..
సాధారణ రోజుల్లోనే హిజ్రాలపై ఎంతటి వివక్ష ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎవరూ పని ఇవ్వరు.. గౌరవం అసలే ఇవ్వరు. అటు ఇంట్లోవాళ్లు,ఇటు సమాజం ఇరువురూ తమ అస్తిత్వాన్ని ఆమోదించే పరిస్థితుల్లో ఉండరు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీద తిరుగుతూ డబ్బులు అడుక్కోవడమే వీరికి ఉన్న ఏకైక ఆధారం. కొన్నిచోట్ల హిజ్రాలు మితిమిరి ప్రవర్తించే ఘటనలు అడపాదడపా చోటు చేసుకుంటున్నప్పటికీ.. వాటిని అందరికీ ఆపాదించలేం. పైగా కరోనా లాంటి సంక్షోభ కాలం నుంచి గట్టెక్కేందుకు హిజ్రాలు సైతం తమవంతు సాయం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆకలితో అలమటిస్తున్నవారి కడుపు నింపుతున్నారు. కడపలో హాసిని ట్రాన్స్జెండర్ అసోసియేషన్ తరుపున ఆహారం పంపిణీ చేశారు. ఇంత మానవీయంగా వ్యవహరిస్తున్న హిజ్రాలపై అమానవీయంగా పోస్టర్లు పెట్టి ప్రచారం చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సవాల్గా మారిన ఫేక్ న్యూస్..
కరోనా నియంత్రణ చర్యల కంటే ఫేక్ న్యూస్ నియంత్రణ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఏదో అయిపోయింది.. అంతా ఖతమ్ అన్నట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వార్డ్ చేసి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరికొందరు ఇలా చేయండి.. అలా చేయండి.. అంటూ లేనిపోని చిట్కాలతో అపోహలు సృష్టిస్తున్నారు. కొందరైతే వైన్ షాప్స్ తెరుస్తున్నారని... ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుందని.. రాష్ట్రంలో ఆర్మీని దింపారని.. ఇలా ఏది పడితే అది వాట్సాప్ గ్రూపుల్లో వదులుతున్నారు. తాజాగా కరోనాకు హిజ్రాలకు ముడిపెడుతూ ఏకంగా పోస్టర్లు ముద్రించి మరో గందరగోళానికి తెరలేపారు. ఆదివారం (మార్చి 29) ప్రెస్ మీట్లో ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఆ దిశగా చర్యలు అమలైతే తప్ప ఇలాంటి ఫేక్ ప్రచారాలకు తెరపడేలా కనిపించడం లేదు.