తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా: ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు నమోదు, 10 మరణాలు
హైదరాబాద్: హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో 'పది' పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సర్కారుపై ఆగ్రహం
పరీక్షలు ఎప్పుడో సీఎంతో చర్చించి..
పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై త్వరలో సీఎం కేసీఆర్తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. కాగా, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలంటూ ఇప్పటికే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
ఒక్కరోజులో అత్యధిక కేసులు, మరణాలు
ఇది ఇలావుండగా, శనివారం కూడా తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 206 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసులతో పోలిస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ ఒక్క రోజే 10 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 123కు చేరింది.
జీహెచ్ఎంసీతోపాటు జిల్లాల్లోనూ..
గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్లో 18, నిర్మల్, యాదాద్రి జిల్లాల్లో ఐదేసి చొప్పున, మహబూబ్ నగర్ జిల్లాలో 4, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 2 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్, వికారాబాద్, జనగామ, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Recommended Video
రాష్ట్రంలో కేసులు ఇలా
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1710 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1663 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో కేవలం రాష్ట్ర పరిధిలోనివి 3048 కేసులు కాగా, మరో 448 మంది వలస కూలీలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ మినహా 15 జిల్లాల్లో 54 కేసులు నమోదు కావడం గమనార్హం.