ఓటెయ్యలేకపోతున్న వలస కార్మికుడు.. కూలీల కన్నీటి గాథ!
Bihar Election 2025: బీహార్ రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కానీ పలు రాష్ట్రాలకు వలస వెళ్లిన వలస కార్మికులకు మాత్రం కష్టాలే మిగిలాయి. తెలంగాణలోని హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నివసిస్తున్న వేలాది మంది బీహార్ వలస కార్మికులు నేడు జరుగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థలాలకు వెళ్లలేకపోయారు. దీనికి ప్రధాన కారణం తీవ్రమైన రైళ్ల కొరత కావడం గమనార్హం.
ఒకే ఒక రైలు మాత్రమే..
ప్రస్తుతం హైదరాబాద్, బీహార్ మధ్య రోజూ కేవలం ఒక రెగ్యులర్ రైలు మాత్రమే నడుస్తోంది. ఎన్నికల కోసం ప్రకటించిన 10కి పైగా ప్రత్యేక రైళ్లు కూడా పూర్తిగా బుక్ అయ్యాయి. వాటిలో సుదీర్ఘ వెయిటింగ్ లిస్ట్లు ఉన్నాయి. మిగిలి ఉన్న కొన్ని సీట్లు కేవలం ఏసీ కోచ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకు ఉంది. రోజువారీ కూలీల ఆదాయంతో పోలిస్తే ఈ ధరలు వారికి భరించలేనివిగా మారాయి.హైదరాబాద్లోని ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న వలస కార్మికుడు మాట్లాడుతూ.. "గతంలో పండుగల సమయంలో మాత్రమే టిక్కెట్ల ధరలు పెరిగేవి. ఇప్పుడు అవి సంవత్సరం పొడవునా భరించలేని స్థాయిలో ఉన్నాయి" అని వాపోయాడు.

లక్షల్లో ఉన్న బీహారీ వలస కార్మికులు
అంచనాల ప్రకారం.. ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 10 నుంచి 12 లక్షల మంది బీహార్ కార్మికులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగం, చిన్నతరహా పరిశ్రమలు, ఇతర అసంఘటిత రంగాలలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఇటీవల ఛట్ పూజ కోసం స్వస్థలాలకు వెళ్లి వెంటనే తిరిగి వచ్చారు. ఇప్పుడు అధిక ఛార్జీలు, పరిమిత రైళ్ల కారణంగా.. పని నుంచి సెలవు తీసుకున్నప్పటికీ ఓటు వేయడానికి మళ్లీ సొంతూరు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. కాగా.. బీహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి 12,000 ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్రం గతంలో ప్రకటించినప్పటికీ, ఈ ప్రణాళిక ఇంకా అమలులోకి రాలేదు. దీంతో వలస కార్మికుల ఓటు హక్కుకు రైళ్ల కొరత అడ్డంకిగా మారింది.












Click it and Unblock the Notifications