పేరెంట్స్ మందలింపుతో బాలుడు ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్/ వరంగల్: మహబూబ్నగర్ జిల్లాలోని ఆత్మకూరు మండలం దేవరపల్లికి చెందిన పదేళ్ల బాలుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాలమణి, కృష్ణయ్యల కుమారుడు మహేష్ పాఠశాలకు డుమ్మా కొట్టాడు. దీంతో తల్లి మందలించడం బాలుడ్ని తీవ్రంగా కలిచివేసింది.
ప్రాణాలు తీసుకోవాలని భావించి తల్లి కూలి పనికి వెళ్ళగానే ఇంట్లో కిరోసిన ఒంటిటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.మంటలకు తాళలేక కేకలు వేసిన బాలుడ్ని ఇరుగు పొరుగువారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పదేళ్ళ బాలుడికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రావడం ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లా జనగామ మండలం చీటకోడూరుకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థిని దాసరి ఉమ (18) నిద్రిస్తుండగా తెల్లవారుజామున పాముకాటు వేసింది. వెంటనే జనగామ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.