ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ అట్టర్ ఫ్లాప్!.. సున్నా మార్కులొచ్చిన నవ్య డిస్టింగ్షన్లో పాస్!
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మూల్యాకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన నవ్య ఉదంతం ఇదే విషయాన్ని రుజువుచేస్తోంది. ఇంటర్ బోర్డు ఎంత మంది విద్యార్థులను జీవితాలను ఆగం చేసిందోనన్న ప్రశ్న లేవనెత్తుతోంది.
పరీక్షల్లో ఫెయిలైతే ఓడినట్లు కాదు.. గుండె తరుక్కుపోతోంది : హరీశ్ రావు
తెలుగులో 0 మార్కులు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెంకు చెందిన నవ్య బ్రైట్ స్టూడెంట్. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన తను కచ్చితంగా మంచి మార్కులు వస్తాయని ధీమాతో ఉంది. ఫస్టియర్లో డిస్ట్రిక్ టాపర్ అయిన నవ్య ఫలితాలు చూసుకుని ఒక్కసారిగా షాకైంది. తెలుగు సబ్జెక్టులో సున్నామార్కులు రావడంతో కన్నీరుమున్నీరైంది.
రీ వాల్యుయేషన్లో 99 మార్కులు
నవ్య బ్రైట్ స్టూడెంట్ కావడం తెలుగులో సున్నామార్కులు రావడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఫలితాల విషయంలో ఇంటర్ బోర్డు వైఫల్యంపై వార్తలు రావడంతో రీవాల్యుయేషన్కు అప్లై చేసింది. దీంతో నవ్య ఆన్సర్ షీట్ను పరిశీలించిన అధికారులు ఆమెకు 99 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. దీంతో నవ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
నిర్లక్ష్యానికి పరాకాష్ఠ
నవ్య ఉదంతంతో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితాల్లో గందరగోళంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించినా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి మాత్రం తమ తప్పేమీలేదని చెబుతుండటం కొసమెరుపు.