ఆహారంలో బల్లి: బాలిక హాస్టల్లో 33 మందికి అస్వస్థత, ఆందోళనకరంగా 11 మంది పరిస్థితి
వరంగల్: రాష్ట్రంలో కలుషితాహారం బారినపడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, సోమవారం వరంగల్ జిల్లా వర్దన్నపేటలోని గర్ల్స్ హాస్టల్లో 30 మందికిపైగా విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతి గృహంలో సోమవారం రాత్రి భోజనంలో బల్లి వచ్చిందని ఓ విద్యార్థిని గుర్తించి మిగితా విద్యార్థులకు చెప్పింది. దీంతో వెంటనే మిగితా విద్యార్థులు తినడం ఆపేశారు.
అయితే, కొంత సమయం తర్వాత ఆ ఆహారం తిన్న విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది. మొత్తం 33 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గమనించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 33 మందిలో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, ఇటీవల ఇలాంటి ఘటనలు పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు. వర్దన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించింది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు నిత్యకృత్యంగా మారడం పేదల ప్రాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.