సీఎంకు సమయం లేదు: సుచరితా రెడ్డికి మరోసారి దొరకని అపాయింట్మెంట్
హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు చేసిన తాజా ప్రయత్నం ఫలించలేదు.
పాలేరు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిని నిలిపే విషయంలో పునరాలోచించాలని కోరేందుకు రాంరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి, కుటుంబసభ్యులు, కాంగ్రెస్ సభ్యులు వెళ్లారు.
ఇందుకోసం సోమవారం సీఎం కెసిఆర్ అపాయింట్మెంట్ కోరగా.. ముఖ్యమంత్రికి సమయం లేదని సీఎం కార్యాలయ వర్గాల నుంచి సమాధానం వచ్చింది. గతంలో కూడా రాంరెడ్డి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసేందుకు ప్రయత్నించగా అప్పుడు కూడా ఇదే సమాధానం వచ్చింది.
నామినేషన్ల గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితా రెడ్డి.. సీఎం కెసిఆర్ను కోరుతూ ఓ లేఖ రాశారు.
కాగా, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తమ మద్దతు తెలుపుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికార టిఆర్ఎస్ పార్టీ మాత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి పోటీలో నిలిచింది.