డబ్బులు ముద్రిస్తుందా: డైరెక్టర్కు సుజన షాక్, తెలంగాణ ఎంపీ పేరు లేదని ఆగ్రహం
హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనా చౌదరి సోమవారం నాడు ఇన్కాయిస్ డైరెక్టర్ షెనాయ్కి చురకలు అంటించారు. తమ సంస్థ అభ్యున్నతికి కేంద్రం ఆర్థికంగా చేయూతనందించాలని షెనాయ్ అభ్యర్థించారు. దీనికి సుజనా చౌదరి స్పందిస్తూ... కేంద్రం ఏమైనా డబ్బుల్ని ముద్రిస్తుందా? అని ఝలక్ ఇచ్చారు.
ఉన్న వనరులను ఉపయోగించుకొని నిధుల సమీకరణ చేసుకోవాలని హితవు పలికారు. కేంద్రం పైన ఆధారపడటం సరికాదన్నారు. అవసరమైతే కేంద్రం తప్పక ఆదుకుంటుందని చెప్పారు.
హైదరాబాద్ శివారు ప్రగతి నగర్లోని ఇన్కాయిస్ ఆవరణలో రూ.50 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించనున్న ‘అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన కార్యాచరణ శిక్షణ కేంద్రం, వసతి గృహాల సముదాయం(ఐటీసీఓ-ఓషియన్)' పనులకు సోమవారం సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఇన్కాయిస్ డైరెక్టర్కు సుజనా చౌదరి ఝలక్ ఇచ్చారు. మరోవైపు, శిలాఫలం పైన స్థానిక ఎంపీ, టిడిపి నేత మల్లారెడ్డి, స్థానిక టిడిపి ఎమ్మెల్యే జి వివేక్ పేర్లు లేకపోవడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
ఆవిష్కరణ అనంతరం దానిపై స్థానిక ఎంపీ మల్లారెడ్డి పేరు లేకపోవడంపై సుజనా చౌదరి... ఇన్కాయిస్ డైరెక్టర్ షెనాయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించకపోవడం సరికాదన్నారు.
సభ ముగిశాక కార్యక్రమానికి వచ్చిన ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. శిలాఫలకంపై తన పేరును ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. వెంటనే దానిని మార్చి కొత్తది ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.