నాకు 120 కంపెనీలు ఉన్నాయని ఈడీ చెప్పింది, ఉండొద్దని రూల్ ఉందా: సుజనా చౌదరి
హైదరాబాద్/విజయవాడ: హైదరాబాద్, ఢిల్లీలలోని తమ కార్యాలయాలు, తన తండ్రి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆదివారం చెప్పారు. తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఆయన స్పందించారు. అనామక కంపెనీతో తన కంపెనీకి సంబంధాలు ఉన్నాయని సోదాలు చేశారని చెప్పారు.
బెస్ట్ అండ్ క్రమ్టన్లో లావాదేవీలు జరిపారని పేర్కొన్నారని సుజ చెప్పారు. ఈ సంస్థ తమ స్నేహితులది అన్నారు. వాళ్లు నా వద్దకు వస్తారని, వాళ్ల వద్దకు నేను వెళ్తానని చెప్పారు. దేశవ్యాప్తంగా తన వద్దకు అనేక కంపెనీలు తన సలహాల కోసం వస్తుంటాయని తెలిపారు.
గత 27 ఏళ్లుగా తాను ఒకే ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. ఈడీ జఫ్తు చేసిన ఆరు కార్లలో మూడు కార్లు మా అబ్బాయి పేరు మీద ఉన్నాయని, రూ.3 లక్షల పాత కారు కూడా అందులో ఉందని తెలిపారు. నాగార్జున హిల్స్లో ఉన్న సంస్థకు నలుగురు యజమానులు ఉన్నారని చెప్పారు.
తాను 2010 అనంతరం తన కార్యాలయాలకు ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. తన రాజకీయ జీవితం ప్రారంభం కాగానే వ్యాపారాలపై దృష్టి పెట్టలేదని చెప్పారు. తన పేరు మీద ఉన్న కంపెనీలు ఎలాంటి తప్పులు, ఫ్రాడ్స్ చేయలేదన్నారు. 2015 వరకు అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు.
బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడం అనేది క్రిమినల్ చర్య కాదని, ఈడీ చెప్పినంత మాత్రాన లావాదేవీలు బ్యాంకులో ఉండవని చెప్పారు. తన కంపెనీలకు తాను, తన స్నేహితుడు శ్రీనివాస్ రాజు ఉన్నామని చెప్పారు. తన పేరు మీద 120 కంపెనీలు ఉన్నాయని ఈడీ చెప్పిందని, అన్ని కంపెనీలు పెట్టవద్దని రూల్ ఉందా అని ప్రశ్నించారు.
2012 తర్వాత నుంచి తన కంపెనీల నుంచి ఎలాంటి జీతాలు తీసుకోలేదని చెప్పారు. నా సంస్థలపై బ్యాంకు ఫిర్యాదు మేరకు సోదాలు అని అన్నారని, కానీ ఎలాంటి బ్యాంకులు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇష్టానుసారంగా చెబుతున్నాయని వాపోయారు.
పార్లమెంటు సమావేశాల అనంతరం ఈడి వద్ద హాజరవుతానని సుజన చెప్పారు. తన పేరు మీద ఎలాంటి కంపెనీలు లేవని స్పష్టం చేశారు. సి రామచంద్రయ్య తనపై చేసిన ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈడీ చూపించిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న మొత్తం వాస్తవం కాదన్నారు.
ఈడీ చేసిన సోదాలపై చట్టపరంగా వెళ్తానని సుజన చెప్పారు. చర్చలు జరుపుతున్నామని అన్నారు. 2009 ఎన్నికల తర్వాత తనపై ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని అన్నారు. నిజంగా ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. పీఎంఎల్ఐ యాక్ట్ ప్రకారమే సమన్లు ఇచ్చానని, తన ఆస్తుల విలువ అప్పుల కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు.
తన కంపెనీల్లో శ్రీనివాస్ ఎలాంటి పెట్టుబడులు అంతగా పెట్టలేదన్నారు. ఈడీ చేసిన సోదాలు తొందరపాటు చర్య అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులకు, తనపై సోదాలకు సంబంధం లేదని చెప్పారు.