కెసిఆర్కు సాటిలేరు: జయలలితతో పోల్చిన సుమన్
వరంగల్: ప్రముక నటుడు సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. పాలనా దక్షతతో అనతికాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తూ దేశంలోనే ఉత్తమ సీఎంగా కేసీఆర్ నిలిచారని కొనియాడారు.
తమిళనాడులో సీఎం జయలలిత అనేక అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజలుకు చేరవయ్యారని, అదే తరహాలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి దేశంలో నంబర్ వన్ సీఎంగా నిలిచారని ప్రశంసించారు.
బుధవారం వరంగల్ జిల్లా మద్దూరు మండలం లింగాపూర్లో నలుగొప్పుల సాయన్న విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వజ్రంగౌడ్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు.
సాయన్న ట్రస్ట్ చైర్మన్ నలుగొప్పు ల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. కటిక చీకట్లున్న తెలంగాణలో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
స్వరాష్ట్రం కోసం పోరాడి అమరులైన వీరుల కుటుంబాలను ఆదుకోవడంతోపాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ నాయకునికి అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. గతంలో కంటే ప్రస్తుతం రాష్ట్రంలో పాలన బాగుందన్నారు.
అన్ని ప్రాంతాలు తనకు సమానమే అయినప్పటికీ తెలుగు అభిమానులంటే ఎంతో ఇష్టమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవమన్నారు. గ్రామీణ ప్రజలకు విద్యాబుద్ధులు చెప్పి వారిని చైతన్యవంతులుగా తయారు చేసిన సాయన్న సేవలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.