కాంగ్రెస్కు మరో షాక్: తెరాసలోకి మాజీ మహిళా మంత్రి?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. భర్త లక్ష్మారెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చి మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి కాంగ్రెసు నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన సునీత లక్ష్మారెడ్డి ఇప్పుడు కారు ఎక్కడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సునీతా లక్ష్మారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. మూడు సార్లు వరుసగా గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జిల్లా బాధ్యతలను మోస్తున్నారు. అయితే ఆమె కాంగ్రెసు పార్టీని వదిలేసి టిఆర్ఎస్లో చేరుతారని ప్రచారం సాగుతోంది.
రెండేళ్ల క్రితమే సునీత పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఆమె కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమె ఇప్పటికే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తమ పార్టీలోకి రావాలని కెసిఆర్ చాలా రోజుల క్రితమే సునీతా లక్ష్మారెడ్డిని ఆహ్వానించినట్లు కూడా చెబుతున్నారు.
అయితే, సునీతా రెడ్డి మాత్రం టీఆర్ఎస్లోకి వెళ్లాలా వద్దా అనే డైలమాలో పడినట్లు కూడా చెబుతున్నారు. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి పలువురు ప్రముఖ కాంగ్రెసు నేతలు కారు ఎక్కేశారు. పార్టీ నాయకత్వం బుజ్జగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో సునీతా లక్ష్మారెడ్డి విషయాన్ని ఆమె నిర్ణయానికే వదిలేసినట్లు కూడా చెబుతున్నారు.