ముందస్తు ఎన్నికలు: సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Recommended Video

న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్రం ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
తెలంగాణలో ముందస్తు వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని, ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలు సరిద్దకుండా ఎన్నికలకు వెళితే ఓటింగ్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పిటీషనర్ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో 2018, జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

అయితే, ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో సుమారు 20లక్షల మంది యువత తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని శశాంక్ రెడ్డి సుప్రీంకోర్టుకు వివరించారు. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే 2019, జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారు సైతం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండేదని తెలిపారు. ఇప్పుడు వారంతా ఓటు వేసే హక్కును కోల్పోతారని చెప్పారు.
అంతేగాక, హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత కూడా లోపించే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూనే.. సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి షాకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications