కవిత బయటకు వస్తారా - కీలక పరిణామం..!!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు. కవిత త్వరలోనే బయటకు వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. న్యాయస్థానాల్లో బెయిల్ కోసం కవిత చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. మరోసారి కవిత బెయిల్ పిటీషన్ పైన ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు.
కవిత పిటీషన్
ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహాడ్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్ జైలులో ఉండగానే అరెస్టు చేసింది.

సుప్రీంలో విచారణ
కవిత తన బెయిల్ కోసం పలు ప్రయత్నాలు చేసారు. తాజాగా కేటీఆర్ పలు దశలుగా ముకుల్ రోహత్గీతో చర్చలు జరిపారు. ఆ తర్వాతే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయటంతో పాటు కింది కోర్టుల్లో ఉన్న ఇతర పిటీషన్లను ఉపసంహరించుకున్నారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని.. జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. అయితే కవిత అరెస్ట్ నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
బెయిల్ దక్కేనా
ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్షీట్ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో, ఈ రోజు జరిగే విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications