కెసిఆర్కు సిబిఐ చిక్కు: మోడీకి ఫిర్యాదు చేస్తామన్న సురవరం, చండీయాగంపై..
హైదరాబాద్: కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేటాయింపుల పైన సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కెసిఆర్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని తెలిపారు. దీని పైన తాము వామపక్షాల ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విపక్షాల పైన కెసిఆర్ నియంతృత్వ ధోరణి సరికాదన్నారు.
కెసిఆర్ తలపెట్టిన చండీయాగం పైన కూడా సురవరం స్పందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన సొంత ఖర్చుతో యాగాన్ని చేసుకోవాలని సురవరం అన్నారు. ప్రభుత్వ ఖర్చుతో యాగం నిర్వహిస్తే తాము అంగీకరించమన్నారు. విశ్వాసాలు అనేవి వ్యక్తిగతమన్నారు.
అలాంటివాటికి ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సురవరం గో సంరక్షణ గురించి ప్రస్తావించారు. తమ పార్టీ గో సంరక్షణకు వ్యతిరేకంగా కాదన్నారు. ప్రధాని మోడీ త్రీ ఇడియట్స్ అని వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగదన్నారు.
వెంకయ్యనాయుడుకు కేంద్రమంత్రి పదవి రాగానే ప్రధాని నరేంద్ర మోడీ దేవదూతలా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్నే ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తలసాని మంత్రి పదవిపై ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ టికెట్ పైన శాసన సభ్యుడిగా విజయం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్కు మధుసూదనా చారి, గవర్నర్ నరసింహన్లకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా తలసాని మంత్రి పదవిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తలసాని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు.