తహసీల్దార్ల వేతనాలు చెల్లించొద్దని సూర్యాపేట కలెక్టర్ సంచలనం ..తిరిగి నిర్ణయం ఉపసంహరణ .. ఎందుకంటే
సూర్యాపేట కలెక్టర్ సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న తహసిల్దార్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూ రికార్డుల నవీనీకరణ లో నిర్లక్ష్యం చేస్తున్న తహసీల్దార్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ సదరు తహసీల్దార్లకు ఫిబ్రవరి నెల వేతనాలను చెల్లించరాదని అధికారులను ఆదేశించారు. భూరికార్డుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ తహసీల్దార్ ల పనితీరు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే భూ రికార్డుల నవీనీకరణ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించిన కలెక్టర్ తహసీల్దార్లు జాప్యం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

19 మండలాల తహసీల్దార్లకు నెల జీతం ఇవ్వద్దని ఆదేశించిన కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపే భూ రికార్డుల నవీనీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కలెక్టర్ అమయ్ కుమార్ ఈ నెలాఖరుకల్లా పార్ట్ - ఏ లో వివాద రహిత ఖాతాలన్నింటికీ డిజిటల్ సంతకాలు పూర్తి చేసి ఈ పీ పీ బి ముద్రణకు అందించాలని నిర్దేశించారు. అయితే తుంగతుర్తి, నూతనకల్, సూర్యాపేట, నాగారం, మోతె ,మద్దిరాల,ఆత్మకూరు (ఎస్), జాజిరెడ్డిగూడెం వంటి మొత్తం 19 మండలాల్లో తహసీల్దార్ల పనితీరు బాగోలేదని వారికి జీతాలు ఇవ్వద్దని ఆదేశించారు కలెక్టర్ అమయ్ కుమార్.కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట ట్రెజరీలకు జీతం నిలుపుదలకు ఆదేశాలు పంపించారు.

కలెక్టర్ నిర్ణయంతో తహసిల్దార్లు షాక్.. కలెక్టర్ తో చర్చలు జరిపిన తహసీల్దార్ అసోసియేషన్
కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో తహసిల్దార్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఏ కలెక్టర్ ఈ తరహా నిర్ణయాలు తీసుకోలేదని తహసిల్దార్లు తమ పరిస్థితిని రాష్ట్ర తహసీల్దార్ల అసోసియేషన్ కు విన్నవించుకున్నారు. తాము విధులను సక్రమంగా నిర్వహిస్తున్నామని, విధి నిర్వహణలో తీరిక లేకపోవడంతో నే భూ రికార్డుల నవీనీకరణ ఆలస్యమైంది తప్ప తమది అలసత్వం కాదని వారు అసోసియేషన్ కు తెలిపారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో ఫిబ్రవరి తాలూకు జీతాలు నిలుపుదల చేశారు ట్రెజరీ అధికారులు. అయితే తహసీల్దార్ అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్ అమయ్ కుమార్ పై ఈ వ్యవహారంపై మాట్లాడి సమస్య పరిష్కరించినట్టు తెలుస్తోంది.
దీంతో కలెక్టర్ అమయ్ కుమార్ జీతాలు ఇవద్దన్న తన ఆదేశాలను తిరిగి ఉపసంహరించుకున్నారు.

కలెక్టర్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్త చర్చ.. జీతాల నిలుపుదల ఉపసంహరణ
అయితే పనిలో జాప్యం చేసిన తహసిల్దార్ లపై కలెక్టర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణమైంది. ఉదయం జీతాలను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకొని సాయంత్రానికి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు కలెక్టర్ అమయ్ కుమార్. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు పని పట్ల అలసత్వం ప్రదర్శిస్తే, నిర్దేశించిన సమయానికి పని పూర్తి చేయకుంటే చర్యలకు సైతం వెనకాడని కలెక్టర్ తీరును ప్రజలు మెచ్చుకుంటే, పని విషయంలో తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని కలెక్టర్ తీరుపై జిల్లా అధికారులు లోలోపల మదన పడుతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications