నాలుగోతేదీపై ఉత్కంఠ.. కొడంగల్ వైపు అందరి చూపు.. రేవంత్ కు ఈసీ నోటీసులు
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం వేడెక్కిన తరుణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్, ప్రజాకూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈక్రమంలో నాలుగోతేదీన కొడంగల్ లో జరగాల్సిన కేసీఆర్ పర్యటన చర్చానీయాంశంగా మారింది.
తాజాగా కొడంగల్ లో జరిగిన పరిణామాలతో ఇక్కడికి నువ్వెట్లొస్తావ్ కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు ఆయనకు నోటీసులు జారీచేశారు అధికారులు. అంతేకాదు కేసీఆర్ కు పూర్తి భద్రత కల్పించేలా పోలీసాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రచారం.. రేవంత్ గరం
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు ప్రజాకూటమి లీడర్లు. ఈక్రమంలో తాజాగా కొడంగల్ లో రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో కక్ష సాధింపులో భాగంగా కేసీఆర్ ఇలా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. నాలుగో తేదీన కొడంగల్ కు ఎట్లోస్తావు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆరునూరైనా కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఒకడ్ని ఓడించడానికి ఇంతమందా అంటూ ఎద్దేవా చేసిన రేవంత్.. మీ సంగతి చూస్తా అంటూ ఫైరయ్యారు.
అందరి చూపు.. కొడంగల్ వైపు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజల చూపు కొడంగల్ వైపు మళ్లింది. నాలుగో తేదీన కొడంగల్ లో ఏం జరగబోతోందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే రేవంత్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు ఆయనకు నోటీసులు జారీచేశారు అధికారులు.
నాలుగో తేది.. ఉత్కంఠ..!
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి. ఈనేపథ్యంలో ఇటీవల ఐటీ దాడులు జరగడం, ప్రచార సభల్లో ఆయన మాట్లాడిన తీరుపై ఈసీ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ను ఎదుర్కోవడం చేతగాక కేసీఆర్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనేది రేవంత్ ప్రధాన ఆరోపణ. ఇటు కేసీఆర్ నువ్వెట్లోస్తావ్ అంటూ రేవంత్ వ్యాఖ్యలు.. అటు ఈసీ సంఘం నోటీసులు, మొత్తానికి నాలుగోతేదీన కొడంగల్ లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే రేవంత్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు జోరందుకోవడం గమనార్హం.