ఉత్కంఠ రేపుతున్న బాబు తెలంగాణ పర్యటన..!!
హైదరాబాద్ : చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అంశం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో బాబు తొలిసారి తెలంగాణ పర్యటన ఉత్కంఠగా మారింది. తెలంగాణ నేతలకు బాబు ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారు.?
పొత్తు అంశాన్ని ఎలా పరిష్కరిస్తారు..? రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం భవిశ్యత్తు ఎలా ఉండబోతోంది అనే సందేహాలకు బాబు తెలంగాణ నేతలతో జరపబోయే భేటీ సమాధానం చెప్పబోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం పైనే అందరి ద్రుష్టి కేంద్రీక్రుతమై ఉంది. కాంగ్రెస్ తో ఎన్ని సీట్ల పంపకాలు ఉంటాయనే అంశం పై సుధీర్గ చర్చ ఉండే అవకాశం ఉంది.

కేసీఆర్ కు ధీటుగా చంద్రబాబు వ్యూహం..! తెలంగాణలో వేడెక్కిన రాజకీయం..!!
కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ రద్దు చేయడంతో ఇక ముందస్తు ఎన్నికలు పక్కా అని తేలిపోయింది. దీనితో పాటు కేసీఆర్ అభ్యర్ధులను కూడా ప్రకటించడంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు వారి అధినేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యచరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ఇక, రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బీజేపీలు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత చంద్రబాబు తొలిసారి పర్యటన..! ఉత్కంఠకు గురౌతున్న పార్టీ శ్రేణులు..!!
ఇందుకోసం ఇప్పటికే పలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. అయితే, 2014కు, ఇప్పటికి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అధికార పార్టీపై కొంత వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం బలపడిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నాయకుల పార్టీ మారినా క్యాడర్ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా పరిణమించింది. ఇక చంద్రబాబు వ్యూహాలు తోడైతే తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో టీడిపి ఓటు బ్యాంక్ ఎక్కువ..! అందుకు కాంగ్రెస్ ఫిదా..!!
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాలనుకుంటున్న టీడీపీ పొత్తుకు సిద్ధం అని పరోక్ష సంకేతాలు ఇచ్చింది. మరోవైపు టీడీపీ ఓటు బ్యాంకును వాడుకోవాలనుకుంటున్న కాంగ్రెస్, ఆ పార్టీతో జతకట్టేందుకు తహతహలాడుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోడానికి సన్నద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ-కాంగ్రెస్ పొత్తు గురించి కీలక సమాచారం బయటికి వచ్చింది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయాయని తెలుస్తోంది.

పొత్తు, సీట్లను ఖరారు చేయనున్న బాబు..! తెలంగాణ నేతల్లో తొణికిసలాడుతున్న ఉత్సాహం..!
కాంగ్రెస్ 75నుండి80 స్థానాలు, టీడీపీ 35 నుండి 40 స్థానాల్లో పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నాయని సమాచారం. ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు కలిస్తే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకోసమే వాటికి ఛాన్స్ ఇవ్వకూడదని ముందస్తు ఎన్నికలను తీసుకొచ్చినట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ స్పీడును అందుకున్న ఈ రెండు పార్టీలు అంతే వేగంగా పావులు కదిపి, పొత్తుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక శనివారం తెలంగాణ నేతలతో సమావేశం అవుతున్న చంద్రబాబు పొత్తులపై ఎలాంటి ప్రకటన చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications