అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనక అనుమానాలు: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి బండి సంజయ్. అబద్ధాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ.. కాంగ్రెస్ అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజపేయి శతజయంతి కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు.
ఆ తర్వాత బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. వాజపేయి భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజా తీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు.

కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని బండి సంజయ్ అన్నారు. రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచతీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ముందు వాటిని సందర్శించాలని రాహుల్ గాంధీకి సూచించారు. ఎన్టీఆర్ మార్క్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారు. ఆయన చరిత్ర తెలిపేలా ఉన్న గదుల్లోకి వెళ్లనివ్వడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు.
ఎన్టీఆర్ ఘాట్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్లి ఎందుకు నివాళులర్పించలేదు అని ప్రశ్నించారు. ఆ విగ్రహం ఎవరు పెట్టారనేది కాదు.. అది అంబేద్కర్ విగ్రహం కాదా? అని నిలదీశారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అని బండి సంజయ్ తెలిపారు. బడుగుబలహీన వర్గాలు నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్నారని చెప్పారు. దళిత మద్దతుతోనే బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.
సినీనటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనక చాలా అనుమానాలున్నాయి. సినీ ఇండస్ట్రీ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రీ ఆంధ్రాకు తరలివెళ్తే తెలంగాణ నష్టం అని అన్నారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా వారి అధిష్టానం అదుపులో పెట్టాలని బండి సంజయ్ సూచించారు.












Click it and Unblock the Notifications