మూల్యం చెల్లించుకుంది!: ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ సస్పెండ్..
బెదిరింపుల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ చర్యల కింద స్వాతి గౌడ్ ను అధికారులు సస్పెండ్ చేశారు.
హైదరాబాద్: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ విషయం స్పష్టంగా తేలడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు..
స్వాతి గౌడ్పై సీక్రెట్గా: అసలేం జరుగుతోంది? నిజమని తేలితే అంతే!..
ఇటీవల ఎల్బీనగర్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో.. ఓ లారీకి స్వాతి గౌడ్ చలానా రాశారు. అయితే అకారణంగా చలానా రాశారంటూ లారీ యజమాని శ్రీకాంత్ రెడ్డి పేచీకి దిగడంతో.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆపై బౌన్సర్లను రంగంలోకి దించిన స్వాతి గౌడ్.. శ్రీకాంత్ రెడ్డిని వారితో కొట్టించింది.
దీనిపై శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. అదే సమయంలో స్వాతి గౌడ్ రివర్స్ లో శ్రీకాంత్ రెడ్డిపై కేసు పెట్టగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివాదం ముదురుతుండటంతో కేసులో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. స్వాతి గౌడ్ గతాన్ని మొత్తం పరిశీలించారు. దీంతో గతంలోను ఆమెపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లుగా తేలింది.
నిజానికి వాహనాలను తనిఖీ చేసే సమయంలో అధికారులెవరూ ఒక్కరే వెళ్లరు. కానీ స్వాతి గైడ్ మాత్రం ఒక్కరే వెళ్లారు. అదీ తన పరిధి కాకపోయినప్పటికీ.. ప్రైవేటు వ్యక్తులను వెంటపెట్టుకుని వెళ్లారు. దీంతో ఆమె వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపుల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ చర్యల కింద స్వాతి గౌడ్ ను అధికారులు సస్పెండ్ చేశారు. స్వాతి గౌడ్ వెంటపెట్టుకెళ్లిన బౌన్సర్లపై కూడా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.