స్వైన్ ఫ్లూ: మరో మహిళ మృతి, పలు కేసులు
హైదరాబాద్: నగరంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. శుక్రవారం ఉదయం స్వైన్ ఫ్లూ వైరస్తో మరో మహిళ మృతి చెందిన ఘటన ఉస్మానియా ఆసుపత్రిలో వెలుగు చూసింది. గత కొన్ని రోజుల క్రితం స్వైన్ ఫ్లూ వ్యాధి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన మహిళ మృత్యువుతో పోరాడి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది.
గత కొంత కాలంగా నగరంలో పలు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత పది రోజుల్లో స్వైన్ ఫ్లూ బారిన పడి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ఇక గురువారం గాంధీ ఆసుపత్రిలో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
నగరంలోని బంజారాహిల్స్కు చెందిన స్వైన్ఫ్లూ బాధితుడు ఒకరు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మరో వ్యక్తి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం వీరికి స్వైన్ఫ్లూ సోకినట్లు నిర్దారించలేదు.
స్వైన్ ఫ్లూ బాధితులు ఆసుపత్రుల నుండి పారిపోతున్నారన్న మీడియా కథనాలు, పిటిషన్ పైన మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీని పైన ఫిబ్రవరి 3వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది.
స్వైన్ ఫ్లూ అంటే ఏమిటీ?
స్వైన్ ఫ్లూ అనేది హెచ్1ఎన్1 రకం ఇన్ప్లూఎంజావైరస్. ఇది ఎక్కువగా పందుల్లో ఉంటుంది. పందుల నుంచి పందులకే వ్యాపించే వ్యాధి. క్రమేనా పందుల వద్ద ఉండే వారికి, పనిచేసే వారికి సోకడం ప్రారంభమైంది. మనిషి నుంచి మనిషికి రావడం మొదలైంది.
ఇది గాలి ద్వారా వ్యాపించే పాండమిక్ వైరస్. మొదట మెక్సికోలో కనిపించిన ఈ వైరస్ తర్వాత యూరప్ ఆ తర్వాత మనదేశంలోకి ప్రవేశించింది. ఈ వైరస్ను ఎదుర్కొవడం ఎలాగో మనలోని రోగ నిరోధక శక్తికి తెలియదు. మొదట ఊపిరితిత్తులు వ్యాధులు వస్తాయి. ఆ తర్వాత వైరల్ న్యూమోనియా, రెస్పిరేటరీ పైల్యూర్ జరిగి ప్రాణాంతకం అవుతుంది.
స్వైన్ ఫ్లూ లక్షణాలు:
దగ్గు, జలుపు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి నీరు రావడం, చిన్న పిల్లల్లో వాంతులు విరేచనాలు జరగడం స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.