మున్సిపల్ బిల్లుకు ఆమోదం, పింఛన్ల వయస్సు 57 ఏళ్లకు తగ్గింపు.. ఇవీ క్యాబినెట్ నిర్ణయాలు
హైదరాబాద్ : కొత్త పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లును తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుపై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపల్ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో కొత్త బిల్లును రూపొందించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 5 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు.

బిల్లుకు ఆమోదం
1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో కొత్త బిల్లును రూపొందించారు. ఈ బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో రెండురోజులు సభ జరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం క్యాబినెట్ సమావేశమై .. బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ కూడా ఆమోదం తెలిపింది. గురువారం అసెంబ్లీలో, శుక్రవారం మండలిలో బిల్లు ప్రవేశపెడతారు.
దీంతోపాటు వృద్ధాప్య ఫించన్ వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. 57 ఏళ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను రూపొందించి పింఛన్ అందజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని తొలగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఫించన్ అందజేయాలని స్పష్టంచేసింది దీనికి సంబంధించి ఈ నెల 20న పింఛన్ల ప్రొసిడీంగ్స్ను లబ్ధిదారుకు అందజేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications