మరోసారి అసెంబ్లీని కోర్టుకు లాగుతున్న కాంగ్రెస్ ! ఫిరాయింపులపై పిటిషన్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి సీఎల్పీకి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరబోతోన్న 11 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి సీఎల్పీని టీఆర్ఎస్పీలో విలీనం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

11 మంది ఎమ్మెల్యేలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు హ్యాండిస్తూ .. టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పటికే ఆ సంఖ్య 11 మందికి చేరింది. ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజీనామాతో పార్టీని వీడబోతున్న ఎమ్మెల్యేల సంఖ్య 11కి చేరింది. దీంతో ఎక్కడ వారు స్పీకర్ని కలిసి సీఎల్పీని విలీనం చేయమని కోరతారోనని ఊహించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముందే అలర్ట్
ఇదివరకు సభాపతిపై మైకు విసిరేసిన కేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అనర్హతకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ .. ఈసారి ముందే కాంగ్రెస్ పార్టీ అలర్టైంది. సీఎల్పీని విలీనం చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీచేయాలని పిటిషన్లో కోరారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రస్తావించింది. ఆ తర్వాత ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరింది. అంతేకాదు సీఎల్పీని విలీనం చేసే పరిస్థితి ఉంటే తమకు నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించింది. కాంగ్రెస్ నేతల పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు .. రేపు వాదనలు విననుంది.
కోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి .. టీఆర్ఎస్లో చేరతామని ప్రకటించిన ఎమ్మెల్యేల సంఖ్య గండ్రతో 11 మందికి చేరింది. ఎమ్మెల్యేలంతా స్పీకర్ని కలిసి సీఎల్పీని విలీనం చేయాలని కోరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తమ్, భట్టి హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications