తుని వెళ్లలేదు కానీ అరగంటలో హైద్రాబాద్ వస్తారా: బాబుపై తలసాని, 'కాపు'పై కృష్ణయ్య ఫైర్
హైదరాబాద్: కాపు గర్జన, తుని విధ్వంసం నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శించేందుకు అవకాశం వచ్చింది! మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తుని విషాధం పైన స్పందించారు.
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ... తాను అవసరమైతే అరగంటలో హైదరాబాద్ వస్తానని చెప్పారని తలసాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుని ఘటన జరిగి 24 గంటలు అయినా చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
విజయవాడ పక్కనే ఉన్న తునికి ఇన్ని గంటలు గడిచినా వెళ్లని చంద్రబాబు అవసరమైతే హైదరాబాదుకు అరగంటలో వస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. ఏపీలో టిడిపి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో 1,333 మంది అభ్యర్థులు, 74,23,980 మంది ఓటర్లు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకు గానూ 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 74,23,980 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
39,69,007 మంది పురుషులు, 34,53,910 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం ఫిబ్రవరి 5న తేలనుంది. ఇక పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
తుని ఘటనపై ఆర్ కృష్ణయ్య
తుని ఘటన పైన టిడిపి తెలంగాణ ఎమ్మెల్యే, బిసి నేత ఆర్ కృష్ణయ్య స్పందించారు. బలం ఉందని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం సరికాదన్నారు. రాయలసీమలో, కోస్తాంధ్ర ప్రాంతంలో కాపులు ఓసి జాబితాలో ఉన్నారన్నారు. తుని ఘటనను తాము ఖండిస్తున్నామన్నారు.